చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నది. తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమైంది. ఉద్యోగ రీత్యా తల్లి వేరేచోట ఉండాల్సిన పరిస్థితి. తాత, అమ్మమ్మే ఆమెకు అన్నీ. శుక్రవారం పుట్టిన రోజు సందర్భంగా ముస్తాబై తాత, అమ్మమ్మకు సంతోషాలను పంచింది. బడికి వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ గడిపింది.. మిఠాయిలు పంచింది.. ఉపాధ్యాయుల నుంచి ఆశీర్వాదాలు పొందింది. ఇంతలోనే విధికి కన్ను కుట్టిందో ఏమో.. మృత్యువు రూపందాల్చి ఆమె ప్రాణాలను బలి తీసుకున్నది. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 14: చెట్టుకొమ్మ పడి ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. సత్తుపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పూర్ణచంద్రరావు కుమార్తె జ్యోత్స్నకు దశాబ్దన్నర క్రితం అశోక్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె లిఖితా సంతోశ్ (12). ఐదేళ్ల క్రితం అశోక్ గుండెపోటుతో మృతిచెందాడు. తల్లి జ్యోత్స్న హైదరాబాద్లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది.
దీంతో లిఖిత యోగ క్షేమాలను తాత పూర్ణచంద్రరావు, అమ్మమ్మ చూసుకుంటున్నారు. ఆమెను గంగారంలోని సాయిస్ఫూర్తి డీఏవీ స్కూల్లో 6వ తరగతి చదివిస్తున్నారు. శుక్రవారం లిఖిత పుట్టిన రోజు. ఆమె పాఠశాలకు వెళ్లి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్వీట్లు పంచింది. మధ్యాహ్నం తాత పూర్ణచంద్రరావు ద్విచక్రవాహనంపై లిఖితను ఇంటికి తీసుకొస్తుండగా తాళ్లమడ శివారులోని కోత మిషన్ వద్ద చెట్టు కొమ్మ విరిగి ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న లిఖితపై పడింది. ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రురాలిని సత్తుపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.