టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడతామన్నారు. ఈ నిర్ణయాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు స్వాగతిస్తున్నారు. కేసీఆర్కు సంపూర్ణ మద్దతు తెలిపారు.
– నమస్తే నెట్వర్క్
దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం
బీఆర్ఎస్ ఏర్పాటు దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం. నవ శకానికి నాంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కీలక ఘట్టం. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చేటుచేసుకున్నది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దేశంలో విజయదుందుభి మోగిస్తుంది. ప్రధాని మోదీ పాలనలో దేశం భ్రష్టు పట్టింది. కేసీఆర్ అధికారంలోకి వస్తే దేశ ప్రజలందరికీ రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పంటలకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా వంటి పథకాలు దేశమంతా అమలవుతాయి. బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యం.
– నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత
నవశకానికి నాంది..
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది. తెలంగాణాను సాధించి కేసీఆర్ అసాధ్యం చేశారు. ఇదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లోనూ విజయం సాధించారు. దేశ రాజకీయాల్లో ఆయన తన మార్క్ను చూపిస్తారు. బీజేపీ ముక్త్ భారత్ సాధిస్తారు. దేశ్ కీ నేతగా ఆయనకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతారు. ప్రజలు టీఆర్ఎస్ను ఆదరించిన విధంగా దేశమంతా బీఆర్ఎస్ను ఆదరిస్తుంది.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యడు
కేసీఆర్కు అన్నివర్గాల మద్దతు..
బీ(టీ)ఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో పెనుమార్పు ఖాయం. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మత ప్రాతిపదికన ప్రజలను విడదీస్తున్నది, మైనార్టీ వర్గాలకు రక్షణ లేకుండా పోయింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపనతో కొత్త చరిత్రకు నాంది పలికారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశం మొత్తం అమలు కావాలంటే కేసీఆర్కు దేశప్రజల మద్దతు ఎంతో అవసరం. కేసీఆర్ నాయకత్వాన్ని దేశంలోని అనేక పార్టీల నాయకులు, మేధావులు స్వాగతిస్తున్నారు.
– తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ, బీ(టీ)ఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
విద్యుత్ రంగాన్ని కాపాడే ఏకైక వ్యక్తి కేసీఆర్
దేశంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి ఉంది. పబ్లిక్ సెక్టార్ను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. దీంతో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. రైతాంగానికి రక్షణ లేదు. ఇలాంటి తరుణంలో జాతీయ రాజకీయాల్లోకి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తప్పనిసరిగా అడుగు పెట్టాల్సిందే. విద్యుత్రంగాన్ని గాడిలో పెట్టి దేశం మొత్తానికి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
– చారుగుండ్ల రమేశ్, తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, జెన్కో కార్యదర్శి
దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక అధ్యాయం..
బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఆవిర్భావం దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక అధ్యాయం. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తన మార్క్ చూపిస్తారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడతారు. భారత రాజకీయ ముఖచిత్రంపై ఆయన బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తారు. బీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నేను చాలా గర్వపడుతున్నా. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు నా శుభాకాంక్షలు.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, బీ(టీ)ఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
జాతీయ పార్టీ ప్రకటన చరిత్రాత్మకం..
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించి ఇవే తరహా పథకాలను దేశ ప్రజలందరికీ అందిస్తారు. బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ప్రకటన చరిత్రత్మాకం. ఇప్పుడు కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం. ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై తపన ఉన్న నాయకుడాయన. దేశ ప్రజలందరికీ మేలు చేయాలన్న సంకల్పంతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఆయనకు యావత్ దేశ ప్రజలు మద్దతు పలుకుతారు.
– లింగాల కమల్రాజు, ఖమ్మం జడ్పీ చైర్మన్
దేశానికి దిక్చూచి సీఎం కేసీఆర్
తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ ప్రజలందరినీ పోరుబాటలో నడిపించారు. రాష్ర్టాన్ని అభివృద్ధిలో బాటలో నడిపిస్తున్నారు. జాతీయ పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఆయనతోనే ప్రజలందరికీ సంక్షేమ పాలన అందనున్నది. తెలంగాణ వస్తుందని ఎవరూ అనుకోలేదు. అలాగే దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ సంచలన విజయం సాధిస్తారు. మున్ముందు దేశ రాజకీయాల్లో కేసీఆర్ కేంద్ర బిందువు కానున్నారు.
– కోరం కనకయ్య, భద్రాద్రి జడ్పీ చైర్మన్
మతన్మోద బీజేపీకి గుణపాఠం తప్పదు..
మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నది. బీజేపీ విధానాలతో మైనార్టీ ప్రజలు దేశంలో జీవించే పరిస్థితి లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. బీజేపీ విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. బీఆర్ఎస్తో దేశ స్థితిగతులు మారనున్నాయి. కేసీఆర్ విజన్తో దేశ భవిష్యత్తు మారనున్నది.
– పగడాల నాగరాజు, బీ(టీ)ఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు
కేసీఆర్తోనే దేశ భవిష్యత్తు..
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కేవలం ఏడేళ్లలోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మలిచారు. ఉమ్మడి పాలనలో ఉనికి కోల్పోయిన వ్యవసాయరంగానికి జవసత్వాలు తీసుకవచ్చారు. సాగుకు పూర్వ వైభవం తీసుకువచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి విజయం సాధిస్తే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి.
– కూరాకుల నాగభూషణం, డీసీసీబీ చైర్మన్, ఖమ్మం
దేశ రాజకీయాల్లో పెనుమార్పులు
బీఆర్ఎస్ స్థాపనతో దేశ రాజకీయాలలో పెనుమార్పులు రాబోతున్నాయి. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నారు. దేశ ప్రజలకు ఏం కావాలో స్పష్టమైన అవగాహన ఉన్న నేత కేసీఆర్. దేశ భవిష్యత్తును మార్చే సత్తా ఆయనకుంది. జాతీయ పార్టీ స్థాపన నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు.
– బచ్చు విజయ్కుమార్, సుడా చైర్మన్, ఖమ్మం
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించి తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేసిన విధంగానే యావత్ దేశాన్ని అభివృద్ధి చేస్తారు. ఆయన నాయకత్వంపై దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది.
– పునుకొల్లు నీరజ, ఖమ్మం నగర మేయర్
విజయానికి చిరునామా కేసీఆర్..
ఉద్యమ నేతగా కేసీఆర్ రెండు దశాబ్దాల క్రితం ఏరాటు చేసిన టీఆర్ఎస్ అనేక విజయాలను సొంతం చేసుకున్నది. కేసీఆర్ అంటేనే విజయానికి చిరునామా. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు.. ఇలా ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం మెండుగా కలిగిన నాయకుడు కేసీఆర్.
-డౌలే లక్ష్మీప్రసన్న, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్
కేసీఆర్తో దేశంలో పెనుమార్పులు
ప్రసుత్త తరుణంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే. రాష్ట్రం మాదిరిగానే సంక్షేమ పథకాలు దేశమంతటా అమలుకావాలి. దళితబంధు ద్వారా రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో ఆర్థికంగా మార్పు వస్తున్నది. కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు దేశంలో చేపడితే రైతులందరికీ సాగునీరు అందుతుంది. కేసీఆర్తోనే దేశంలో పెనుమార్పులు సాధ్యం. వేరే ప్రత్నామ్నాయమే లేదు.
– వాసుమళ్ల సుందర్రావు, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి