కల్లూరు రూరల్, సెప్టెంబర్ 30: సీఎం కేసీఆర్ పాలన ఆదర్శంగా నిలుస్తోందని, అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కల్లూరు మండలం చిన్నకొరుకొండి, మర్లపాడు, పోచారం, తాళ్లూరు వెంకటాపురం, వెన్నవల్లి, పెద్దకొరుకొండి గ్రామాల్లో ఎంపీ నామా, సత్తుపల్లి ఎమ్మెలే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు కలిసి శుక్రవారం పర్యటించారు. అన్ని గ్రామాల్లోని లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
అనంతరం పోచారంలో జరిగిన సభలో ఎంపీ నామా మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకూ పేదరికం పెరుగుతుంటే.. అంబానీ, ఆదానీల ఆదాయం ఎలా పెరుగుతుందో ప్రధాని మోదీతో దేశ ప్రజలకు సమాధానం చెప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పేదలకు ఇచ్చే సామాజిక పింఛన్ రూ.600 మాత్రమేనని అన్నారు. రూ.2016 పింఛన్ ఇస్తూ పేదలకు అండగా ఉంటున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
పోచారం ఎస్సీ కాలనీలో రూ.25 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సీఎం కేసీఆర్ ‘మన ఊరు – మన బడి’ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు రాయల శేషగిరిరావు, కొత్తూరు ఉమమహేశ్వరరావు, సూర్యనారాయణ, కట్టా అజయ్కుమార్, బీరవల్లి రఘు, పాలెపు రామారావు, పసుమర్తి చందర్రావు, పెడకంటి రామకృష్ణ, ఉబ్బన వెంకటరత్నం, బోబోలు లక్ష్మణ్రావు, కాటంనేని వెంకటేశ్వరరావు, లక్కినేని రఘు, నర్వనేని పెద్ద అంజయ్య, నామా వెంకటేశ్వర రావు, నందిగం ప్రసాద్, కల్యాణపు కొండల్రావు, శీలం సత్యనారాయణ రెడ్డి, లింగవరపు శ్రీనివాసరావు, సింగిశాల ప్రసాద్, మేకల కృష్ణ, పురుషోత్తం, ఉప్పు సుబ్బారావు, పిచ్చిరెడ్డి, రామిరెడ్డి, అనిమిరెడ్డి, చిట్టిబాబు, వేము రత్తమ్మ, నామా రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.