తెలంగాణలో సబ్బండ వర్గాలకు సమన్యాయం.. చేతి, కుల వృత్తులకు పూర్వవైభవం.. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలకు జలశోభితం.. కర్షకులకు స్వర్ణయుగం.. ప్రతి పల్లె ప్రగతి ధామం.. సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటా సంక్షేమం.. ఊరూరా సౌభాగ్యం.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు.. అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శం.. ఇదే ప్రగతి, అభివృద్ధి దేశవ్యాప్తంగా జరగాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని సకలజనులు ముక్తకంఠంతో అంటున్న మాట.. కేంద్రంలో ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ మెడలు వంచాలంటే అది కేసీఆర్తోనే సాధ్యం.. అందుకే సార్ రావాలి.. దేశానికి దిశానిర్దేశం చేయాలని సర్పంచ్లు, ఉపాధ్యాయులు, ఎంపీపీలు పేర్కొంటున్నారు.
– ఖమ్మం, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నది.. కేంద్రం చేతగాని తనంతో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.. సామాన్యులపై పన్నులు, ధరల భారం పడింది.. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అవుతున్నాయి.. మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి.. బీజేపీకి సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమ వుతున్నది.. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కోసం దేశమంతటా ఎదురుచూస్తున్నది.. తిరుగు లేని జాతీయ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నది.. ఈ సందర్భంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే తప్పకుండా విజయం సాధిస్తారని ఎంపీపీలు, ఉపాధ్యాయులు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ప్రజలందరూ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించాలని పిలుపునిస్తున్నారు..
ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. బీజేపీని నిలువరించడం కాంగ్రెస్ వల్ల కాలేదు. ఇతర ప్రాంతీయ పార్టీల వల్ల కాలేదు. కేంద్రాన్ని విమర్శించడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ సీఎం కేసీఆర్ ఒక్కరే ‘జాతీయ రాజకీయాల్లోకి వస్తా… బీజేపీ కథేందో తేలుస్తా ..’ అని శపథం చేశారు. దేశ కాలమాన పరిస్థితులపై అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. లోతైన పరిశీలనా శక్తితో అందరూ బాగుండాలనే తపన ఉన్న నాయకుడాయన. బీజేపీ ఆగడాలను అడ్డుకునే సమర్థత ఉన్న నేత. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయి. సహజ వనరులన్నీ కార్పొరేట్ శక్తుల పాలవుతాయి. వీటన్నింటినీ అడ్డుకోవడం కేసీఆర్తోనే సాధ్యం. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళితే ప్రజలందరూ మద్దతు ఇస్తారు.- కూరపాటి రవీందర్, మాల మహానాడు భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, కొత్తగూడెం
బీడు భూములను సస్యశ్యామలం చేసి రైతుల కుటుంబాల్లో ఆనందం నింపిన వ్యక్తి సీఎం కేసీఆర్. రైతు పక్షపాతిగా వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాయి. 24 గంటల పాటు పంటలకు ఉచిత విద్యుత్ అందుతున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశంలోని రైతులందరికీ మేలు జరగుతుంది. బీజేపీని ఎదుర్కొనగలిగే తెగువ, సత్తా ఆయనకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అత్యవసరం. కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపిస్తే ఆ స్థానం భర్తీ అవుతుంది. ఆయనకు ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది.
– మోహన్ రాథోడ్, తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు, కొత్తగూడెం
ప్రధాని మోదీ పాలనలో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరమయ్యాయి. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే యావత్ భారత్ అన్యాయానికి గురవుతుంది. ఇప్పుడు దేశానికి కేసీఆర్ వంటి నాయకుడి అవసరం ఉంది. ఉద్యమ నేతగా ఆయన స్వరాష్ర్టాన్ని సాధించారు. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఇదే ఒరవడిలో దేశ రాజకీయాల్లోకి వెళ్లి యావత్ భారతాన్ని పాలించాలి.
– లాల్మహ్మద్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు, వైరా
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపస్తున్నారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టి ప్రాజెక్టులు నిర్మించారు. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. ఇలాంటి నాయకుడు దేశాన్ని పాలిస్తే ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతుంది. రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు, రైతుబీమా అందుతున్నట్లుగానే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇలాంటి పథకాలే అందుతాయి. దేశంలో ప్రజారంజక పాలన అందించే ఏకైక నాయకుడు కేసీఆర్. ఆయన జాతీయ పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– షేక్ షఫీ అహ్మద్, అధ్యాపకుడు, సీతారాంపురం, ములకలపల్లి మండలం
ప్రధాని మోదీ పాలనలో దేశం విచ్ఛిన్నమైంది. వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు అన్యాయానికి గురయ్యారు. కార్పొరేట్ శక్తులు సహజ వనరులను దోచుకుంటున్నాయి. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తున్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అగ్రస్థానంలో నిలుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గాడిలో పెట్టాలంటే కేసీఆర్ వంటి నాయకుడే సరి.
– లక్కినేని అలేఖ్య, ఎంపీపీ, పెనుబల్లి
రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతుల కోసం రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ప్రాణం పోశారు. ఇవే పథకాలు దేశమంతటా అమలు కావాలంటే కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. దేశాన్ని ప్రగతి వైపు నడిపించే శక్తి ఆయనకు ఉంది. బీజేపీ పాలనలో దేశ ప్రజలు అన్యాయానికి గురయ్యారు. ప్రజలందరికీ మేలు జరగాలంటే కేసీఆర్ వంటి నాయకుడు కేంద్రంలో ఉండాలి.
– సామా మోహన్రెడ్డి, రైతు, మద్దులపల్లి, కామేపల్లి మండలం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరిస్తున్నది. తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టాలి. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేయాలి. పంటలకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణకూ మేలు జరగుతుంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తర్వాత దక్షిణాది నుంచి దేశ ప్రజలను ప్రభావితం చేసే మరోనేతగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
– మందడి పద్మ, సర్పంచ్, జుజ్జల్రావుపేట, కూసుమంచి మండలం
ప్రస్తుత దేశ రాజకీయాలకు కేసీఆర్ వంటి దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. అసాధ్యం అనుకున్న స్వరాష్ట్ర సాధనను నిజం చేసి చూపించారు ఆయన. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే పట్నం నుంచి పల్లె వరకు అన్నింటి రూపురేఖలు మారిపోయాయి. ఊరూరా నర్సరీలు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్రీడాప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయి. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతులకు భరోసానిస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు సైతం తమను తెలంగాణలో కలపమని అడుగుతున్నారంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వారిని ఎంత ఆకర్షించాయో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కచ్చితంగా విజయం సాధిస్తారు.
– చల్లా మోహన్రావు, సర్పంచ్, తనికెళ్ల, కొణిజర్ల మండలం
అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కేంద్రంలో చక్రం తిప్పగల నాయకుడు కేసీఆర్. రాజకీయాలపై పట్టున్న నాయకుడు ఆయన. దేశంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీజేపీకి కేసీఆర్ కచ్చితంగా చరమగీతం పాడతారు. బీజేపీ విముక్త్ భారత్ సాధిస్తారు.
– భూక్యా భాగ్యలక్ష్మి, సర్పంచ్, కన్నాయిగూడెం, కరకగూడెం మండలం