మణుగూరు టౌన్, సెప్టెంబర్ 21: రైల్వేలైన్ నిర్వాసిత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వాసితులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీటీపీఎస్కు బొగ్గు రవాణా కోసం జరుగుతున్న రైల్వేలైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని అన్నారు. ప్రభుత్వంతో చర్చించి మెరుగైన ప్యాకేజీ అందించేందుకు కృషిచేస్తామని భరోసా కల్పించారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీఆర్ఎస్ నాయకులు ముత్యం బాబు, జావేద్బాషా, వట్టం రాంబాబు, తడికమళ్ల ప్రభుదాస్, హర్షనాయుడు, మేకల రవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పనుల్లో పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్.. ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. పులుసుబొంత ప్రాజెక్టు, వట్టివాగు, లోటారిగండి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఏఈ సక్రు పాల్గొన్నారు.