భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్య లోపాన్ని అధిగమించేందుకు, వారి అభివృద్ధికి బాటలు వేసేందుకు తొలి మెట్టు కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఆయన బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలి మెట్టు అమలు తదితర అంశాలపై చర్చించారు. కనీస సామర్థ్ధ్యాలను పెంచేందుకు పటిష్టమైన ప్రణాళిక అవసరమని అన్నారు. జిల్లాలోని 965 ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నదని అన్నారు. ఇది విజయవంతం కావాలంటే ఉపాధ్యాయులు గైర్హాజరు కాకూడదని అన్నారు. విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులకు శ్రద్ధ ఉండాలన్నారు. తొలి మెట్టు కార్యక్రమ ప్రగతిపై ప్రతి నెలా నివేదిక ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. తొలి మెట్టు కార్యక్రమం అమలు తీరుపై అకడమిక్ కోఆర్డినేటర్ రాజశేఖర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తొలి మెట్టు పర్యవేక్షణ చర్యలను డీఈవో సోమశేఖర శర్మ వివరించారు. సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు నాగరాజు, శేఖర్, సైదులు,సతీష్కుమార్, అన్ని మండలాల ఎంఈవోలు, డీఆర్పీలు పాల్గొన్నారు.
పాల్వంచ, సెప్టెంబర్ 21: ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) సోమశేఖర శర్మ ఆదేశించారు. పాల్వంచలోని కేటీపీఎస్-ఏ కాలనీ ప్రాథమిక పాఠశాల, అభ్యుదయ బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడుతూ… కొవిడ్-19 ప్రభావంతో విద్యావ్యవస్థ బాగా దెబ్బతిన్నదని అన్నారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తొలి మెట్టు’ను ఆగస్టు నుంచి అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం తెలుగు, ఇంగ్ల్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానంలో విద్యార్థుల సామర్థ్ధ్యాన్ని పెంచాలని, వచ్చే విద్యాసంవత్సరం నాటికి పూర్తి స్థ్ధాయిలో మార్పు తీసుకురావాలని అన్నారు. తొలి మెట్టు కరదీపికల ఆధారంగా బోధించాలని ఆదేశించారు. జిల్లా సెక్టోరియల్ అధికారి సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.