సత్తుపల్లి, సెప్టెంబర్ 18 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్రెడ్డి బేషరతుగా చాకలి ఐలమ్మ విగ్రహం సాక్షిగా రజక సంఘానికి క్షమాపణలు చెప్పాలని రజక సంఘ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘ నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆదివారం క్షీరాభిషేకం చేసి అనంతరం రింగు సెంటర్ వద్ద ప్రకాశ్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని చాకలి ఐలమ్మ ఉద్యమస్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పిన విషయాలను బీజేపీ నాయకులు తెలుసుకోవాలన్నారు. తెలుగు రాష్ర్టాల్లో చాకలి ఐలమ్మను కించపరిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రకాశ్ రెడ్డి మాటలకు బీజేపీలోని బీసీ నాయకులు ఈటల రాజేందర్, బండి సంజయ్, కే.అర్వింద్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. రజక సంఘం ఆందోళనకు టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో రజక సంఘ నాయకులు బెల్లంకొండ రాము, యోగానందం, రామకృష్ణ, తెలగారపు అప్పారావు, సతీశ్ మరికంటి శ్రీను, విరివాడ నాగభూషణం, రాము, చింతల సత్యనారాయణ, టోపి శ్రీనివాస్, రాయల కోటి, కోటా రామ్మూర్తి, సాంబ తదితరులు పాల్గొన్నారు.