ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్నభోజనం అందుతున్నది. పోషణ లోపాన్ని నివారించడంతోపాటు ఆరోగ్య సమాజానికి అడుగుపడింది. ఆరోగ్యలక్ష్మి పథకంతో మధ్యాహ్న భోజన పథకం జిల్లావ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చింది. రోజూ క్రమం తప్పకుండా రుచికరమైన భోజనం, ఒక కోడిగుడ్డు, 200 గ్రాములు చొప్పున పాలు అందిస్తున్నారు. తద్వారా కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల హాజరుశాతం పెరిగింది. ఆరోగ్యలక్ష్మి పథకం నిర్వహణ, కేంద్రాల బలోపేతం కోసం ప్రతి కేంద్రానికి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా స్త్రీశిశు సంక్షేమశాఖ పరిధిలోని ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర, సత్తుపల్లి, కల్లూరు, కామేపల్లి ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటి పరిధిలో 1,837 కేంద్రాల ద్వారా చిన్నారులు, మహిళలకు సేవలు అందుతున్నాయి.
జిల్లాలోని 1,837 కేంద్రాల్లో..
జిల్లా స్త్రీ,శిశు సంక్షేమశాఖ పరిధిలో ఏడుప్రాజెక్టుల్లో ఉన్న 1,837 అంగన్వాడీ కేంద్రాల్లో 9,016 మంది గర్భిణులు, 10,323 మంది బాలింతలు, 3-6 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు రోజూ మధ్యాహ్నభోజనం, 6 నెలలు నుంచి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు బాలామృతం అందిస్తున్నారు. గర్భిణులు బాలింతలకు కలిపి ప్రతిరోజు ఒక్కొకరికి రూ.21 ఖర్చు అవుతుండగా.. 3-6 సంవత్సరాల చిన్నారులకు మరో రూ.7 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తద్వారా ప్రతిరోజు ప్రభుత్వ ఖజానాపై
రూ.6,32,969 భారం పడుతున్నది. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో లబ్ధిదారులకు మంచి పోషకపదార్థాలు అందించాలనే ఉద్దేశ్యంతో మెనూ రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజు ఒక కోడిగుడ్డు, 200 గ్రాముల పాలతోపాటు రోజుకోరకమైన ఆకుకూరలు, కాయగూరలతో కూడిన భోజనాన్ని అందిస్తున్నది. వీరితోపాటు 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజు ఒక కోడి గుడ్డుతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు రోజు విడిచి రోజు ఉడికించిన కోడిగుడ్డును అందిస్తున్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రం పరిధిలోని ప్రభుత్వ టీచర్, సర్పంచ్ (కౌన్సిలర్), ఆవాసప్రాంత పెద్దలు, పిల్లల తల్లిదండ్రులతో కమిటీని నియమించారు. కేంద్రాల్లో నాణ్యమైన విద్యతోపాటు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తుండడంతో లబ్ధిదారులు, చిన్నారుల సంఖ్య పెరుగుతున్నది.
పోషణలోపం నివారణకు ప్రత్యేక చర్యలు
మహిళల్లో రక్తహీనత, చిన్నారుల్లో బరువు తక్కువ కలిగిన, సరైన ఎదుగుదల లేని పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోషన్ అభియాన్ అనే ప్రత్యేక మిషన్ను ఏర్పాటు చేశాయి. ఈ ప్రాజెక్టు ద్వారా స్త్రీ,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు పోషణలోపం, బరువుతక్కువ కలిగిన చిన్నారులను గుర్తిస్తున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక కోర్డినేటర్లు, జిల్లా స్థాయిలో ఓ ప్రత్యేక అధికారితోపాటు మరో కోఆర్డినేటర్ సేవలు అందిస్తున్నారు. ప్రాజెక్టు లెవల్లో ఒక బ్లాక్ కోఆర్డినేటర్, మరో అసిస్టెంట్ అధికారి సేవలు అందిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న జిల్లా కోఆర్డినేటర్ ఆయా ప్రాజెక్టుల్లో పనిచేసే బ్లాక్ కో ఆర్డినేటర్, సీడీపీవోలకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన కోఆర్డినేటర్లు ప్రాజెక్టు లెవల్ అధికారులు సెక్టార్లో పనిచేస్తున్న పర్యవేక్షకులు, శిక్షణ టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆరోగ్యలక్ష్మి పథకం మంచి ఫలితాలు ఇస్తున్నది. రుచికరమైన భోజనం, పోషకవిలువలు కలిగిన గుడ్లు, పాలు అందిస్తున్నాం. తద్వారా కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు, చిన్నారుల హాజరుశాతం పెరుగుతున్నది.
-సీహెచ్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమ అధికారి