సత్తుపల్లి, సెప్టెంబర్ 9: ఒకప్పుడు సమస్యలతో సతమతమైన సత్తుపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. ప్రగతి మార్గంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యవేక్షణలో మున్సిపల్ పాలకవర్గం అభివృద్ధి పనులను చేపడుతున్నది. అర్బన్ పార్క్, ఓపెన్ జిమ్, వైకుంఠధామం, పబ్లిక్ టాయిలెట్లు, క్రీడా ప్రాంగణాలు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతో పట్టణ రూపురేఖలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధిపై ప్రత్యేక కథనం.
పట్టణానికే అందం.. ప్రకృతి వనం..
తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.10 లక్షల నిధులతో ఏర్పాటైన పల్లె ప్రకృతి వనం పట్టణానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. వనంలో పెరుగుతున్న మొక్కలు పచ్చందాలను పంచుతున్నాయి. కార్యాలయానికి నిత్యం వచ్చిపోయే ప్రజలు ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి మురిసిపోతున్నారు. పట్టణంలోని 23 వార్డుల్లో రూ.16 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయింది. అంతర్గత రహదారులన్నీ సీసీ, బీటీ రోడ్లుగా మారాయి. మున్సిపల్ పాలకవర్గం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నది.
శరవేగంగా ‘సమీకృత’నిర్మాణం..
పట్టణంలోని వేంసూరు రోడ్లో కూరగాయల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్లు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వంప్రధాన రహదారి పక్కనే రూ.4.50 కోట్లతో వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నది. 80కి పైగా దుకాణాలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులూ తప్పుతాయి.
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు..
మున్సిపాలిటీలో ఎన్టీఆర్ నగర్, రాజీవ్నగర్లో రూ.4 లక్షలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. ఇవేకాకుండా ప్రతి వార్డుకు ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జేవీఆర్ పార్క్లో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో యువకులు ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తున్నారు. పట్టణంలో రూ.10 లక్షలతో ఏర్పాటైన సెంట్రల్ లైటింగ్ రాత్రిళ్లు వెలుగులు ప్రసరిస్తున్నది.
రూ.2 కోట్లతో అర్బన్ పార్క్…
అటవీశాఖ, సింగరేణి ఆధ్వర్యంలో పట్టణంలోని వేంసూర్ రోడ్డులో 375 ఎకరాల్లో నీలాద్రి అర్బన్ పార్క్ ఏర్పాటైంది. రూ.2 కోట్లు వెచ్చించి మున్సిపల్ అధికారులు పార్క్ నిర్మాణం పూర్తి చేశారు. చిల్డ్రన్ పార్క్, క్రీడా ప్రాంగణం, వాకింగ్ ట్రాక్ పార్క్ ప్రత్యేకతలు. పార్క్లో ఉదయం, సాయంత్రం పట్టణవాసులు వ్యాయామం చేస్తున్నారు. చిన్నారులు ఆహ్లాదకరంగా సమయాన్ని గడుపుతున్నారు. పార్క్లోని దుప్పులు, జింకలు, పక్షులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. వాటి దాహం తీర్చేందుకు అటవీశాఖ అధికారులు సోలార్ మోటర్ల సాయంతో నీటి కుంటలు ఏర్పాటు చేశారు.
రూ.35 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం..
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరింది. దీంతో ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసి ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంకల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సహకారంతో ఆస్పత్రి నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు చేయించారు. ఇప్పటికే ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఆహ్లాదకరంగా మున్సిపల్ కార్యాలయం..
ఉమ్మడి పాలనలో సత్తుపల్లి నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ దశాబ్దాల పాటు మున్సిపల్ కార్యాలయం ఇరుకుగదుల్లోనే కొనసాగింది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన రూ.3 కోట్ల నిధులతో అన్ని హంగులతో మున్సిపల్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు కార్యాలయం ఎదుట రూ.8.50 లక్షలతో జాతీయ చిహ్నం, మహాత్ముని విగ్రహం, రూ.30 లక్షలతో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటయ్యాయి. పోస్టాఫీస్ సెంటర్లో రూ.27 లక్షలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటైంది. పట్టణ శివారులోని వెంగళరావునగర్ వద్ద రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన ‘లవ్ సత్తుపల్లి’ పట్టణానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఇప్పుడు అది స్పాట్ సెల్ఫీ కేంద్రంగా మారింది.
త్వరలో చేపట్టే పనులు…
త్వరలో పట్టణంలో రూ.2.50 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం, ఆడిటోరియం, రూ.1.20 కోట్లతో చాకలి ఐలమ్మ భవనం, రూ.2 కోట్లతో నూతన షాదీఖానా అందుబాటులోకి రానున్నాయి. రూ.3 కోట్లతో తామరచెరువు, వేశ్యకాంతల చెరువుల సుందరీకరణ, ట్యాంక్బండ్ల నిర్మాణం, రూ.13 కోట్లతో 23 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. యువతీ యువకుల కోసం వివేకానంద సెంట్రల్ ఫర్ ఎక్స్లెన్స్ భవనం అందుబాటులోకి రానున్నది.
రూ.25 లక్షలతో పబ్లిక్ టాయిలెట్లు..
పట్టణానికి నిత్యం వేలాదిమంది వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. వారికి అనకూలంగా తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, వేంసూరు రోడ్, పాతసెంటర్లో రూ.25 లక్షలతో పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. పట్టణ శివారులోని కొమ్మేపల్లిలోని ఎనిమిదెకరాల భూమిలో రూ.1.30 కోట్లతో డంపింగ్ యార్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో డంపింగ్ సమస్యకూ పరిష్కారం లభించింది.
మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయం..
సత్తుపల్లి మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ అభివృద్ధికి రూ.వందల కోట్లు విడుదల చేశారు. వాటిని పట్టణాభివృద్ధికి వెచ్చిస్తున్నాం. పట్టణ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం.
– సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..
సత్తుపల్లి మునిసిపాలిటీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యవేక్షణలో పట్టణం అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాం. రానున్న రోజుల్లో ప్రభుత్వ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
– కూసంపూడి మహేశ్, మున్సిపల్ చైర్మన్, సత్తుపల్లి