లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే రోల్మోడల్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని 31 పంచాయతీల్లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కొత్తగూడెం మార్కెట్ యార్డు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. లబ్ధిదారులు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని అన్నారు. 20మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆడపిల్లలకు ఈ పథకం వరంలా మారిందని, పేద కుటుంబాల్లో ఆనందాలు నింపుతున్నదని ఎమ్మెల్యే అన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ భూక్యా సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఎంపీడీవో రామారావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీవో శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ అంకుబాబు, మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్పాషా, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, వజ్జా రాజు, ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు కొల్లు పద్మ, స్వాతి, మూర్తి, బాబూరావు, గోవిందు, జక్కుల సుందర్, సర్పంచ్లు బలరాం నాయక్, భూక్యా పద్మ, తాటి పద్మ, లాలు, చంద్రశేఖర్, నాగేశ్వరరావు, కిషన్, రవి పాల్గొన్నారు.
‘ఆసరా’ నాకు ఆధారమైంది
ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ నాకు ఆధారమైంది. ఒంటరిగా ఉన్న బతుకుకు ఈ పింఛన్ దారి చూపింది. ఇక భయం లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, చేతనైనప్పుడు పనికి వెళ్లి సంపాదించుకుంటున్నాను. నా లాంటి వారికి మేమున్నామంటూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తూ ఆసరా పింఛన్లను మంజూరు చేయడం చాలా సంతోషం. ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.
-రాణి, హేమచంద్రాపురం
వృద్ధాప్యంలో కూడు పెడుతున్నది
ఈ వయస్సులో చురుగ్గా పనులకు వెళ్లలేకపోతున్నా. దీంతో జీవనం కష్టంగా మారింది. మేమిద్దరం ముసలోళ్లమే. మాకు చేసిపెట్టే వారు లేరు. వచ్చే ఈ పింఛన్ డబ్బులను పొదుపుగా నెలంతా ఖర్చు చేసుకుంటున్నాం. కేసీఆర్ సార్ మాకు భరోసా కల్పించారు. ఆయనే మా పాలిట దైవం. మా బతుకుల్లో వెలుగులు నింపారు.
– పులుసం రాములు, మైలారం