ములకలపల్లి/ భద్రాచలం, ఆగస్టు 19 : అబార్షన్ వికటించి యువతి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి గర్భవతిని చేసిన వివాహితుడు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించగా వైద్యం వికటించడంతో శుక్రవారం ఆ యువతి మృతిచెందింది. ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన సోడె వరలక్ష్మి, రాములు దంపతుల కుమార్తె శిరీష(19) పాల్వంచలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నది.
ఇంటి వద్ద నుంచి కళాశాలకు వెళ్లి వచ్చే శిరీషతో అదే మండలం పూసుగూడెం గ్రామానికి చెందిన వివాహితుడు భూక్యా నందుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నందు శిరీషకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా లొంగదీసుకున్నాడు. శిరీష గర్భం దాల్చడంతో ములకలపల్లిలోని ఆర్ఎంపీని సంప్రదించగా గర్భం పోవడానికి మాత్రలు ఇచ్చాడు. మాత్ర లు మింగిన శిరీషకు తీవ్ర రక్తస్రావం కావడంతో అదే ఆర్ఎంపీ సూచన మేరకు భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆర్ఎంపీ మాటలు నమ్మిన వారు శిరీషను జాయిన్ చేసుకొని అబార్షన్ చేశారు.
ఈ క్రమంలో శిరీషకు ఫిట్స్ రావడంతో కోమాలోకి వెళ్లింది. డాక్టర్లు ప్రయత్నం చేసినప్పటికీ శిరీష మృతిచెందింది. విషయం తెలుసుకున్న నందు, అతడితోపాటు వచ్చిన మరో యువతి ఆసుపత్రి నుంచి పరారయ్యారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది శిరీష తల్లిదండ్రులు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారమివ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శిరీషకు పెళ్లే కాలేదని, నందు అనే యువకుడు తమకు తెలియదని, అబార్షన్ మీరు ఎలా చేశారని శిరీష కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి సురేశ్ విచారణ చేపట్టారు. ఇదిలాఉండగా ఆసుపత్రిలో అబార్షన్ చేయడానికి అనుమతులు లేకపోవడంతో డీఎంహెచ్వో దయానందస్వామి ఆదేశాల మేరకు వైద్యాధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.