వలసలు నివారించి సొంతూళ్లోనే పని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తున్నది. కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చి కూలీల పొట్ట కొడుతున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం ఒకేసారి కూలీలు 20 పనుల్లోనే పాల్గొనాలి. అవి పూర్తి చేసిన తర్వాతే మరో పని చేపట్టాల్సి ఉంటుంది. అయితే, చిన్నచిన్న పనులయితే ఒకటి రెండురోజుల్లో పూర్తవుతాయి. పెద్ద పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
కూలీలు ఒక్కో పని పూర్తి చేస్తూ మరొక పనికి వెళ్లాలి. ఈ పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో కూలీలకు పని దొరికే అవకాశం ఉండదు. అంతేకాదు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెరగనున్నది. రెండు, మూడేళ్లుగా కొనసాగుతున్న మొక్కల పెంపకం పనులకు నిబంధనలు వర్తించవని కొర్రీ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రమంతటా కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. కొత్త నిబంధనలు కూలీల ఉపాధి దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఉపాధి పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తున్నది. కొత్త పనుల అమలు విషయంలో అనుమతులు కఠినతరం చేసింది. ఒక్కో పంచాయతీలో ఒకే సమయంలో 20 పనులు మాత్రమే చేపట్టాలని కొర్రీ పెట్టింది. 20 పనులు పూర్తయితేనే ఉపాధి అధికారులు మరో పని చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రమంతటా కొత్త నిబంధనలు అమలవుతున్నాయి.
పనుల నిర్వహణ, పర్యవేక్షణ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత అన్ని బిల్లులను ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. కూలీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ అవుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం కేవలం 20 పనులకు మాత్రమే బిల్లుల నమోదుకు అవకాశం ఉంటుంది. దీంతో ఉపాధి కూలీలు పనుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో ఎన్ని పనులు ప్రారంభమైనా కూలీలు మరో పనికి వెళ్లవచ్చు. కానీ ఇప్పుడు అడ్డామీద కూలి పనులకు వెళ్లాల్సి ఉంది.
ఈ ఏడాది 28,127 ఉపాధి పనులు
ఉపాధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. రెండు, మూడేళ్లుగా కొనసాగుతున్న మొక్కల పెంపకానికి పనులు వర్తించవని కేంద్రం కొర్రీ పెట్టింది. జిల్లాలో 2.31 లక్షల కుటుంబాలు ఉపాధి జాబ్కార్డులు కలిగి ఉన్నాయి. వీటి పరిధిలో 5.05 లక్షల మంది కూలీలుగా పేరు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది 65.61 లక్షల పని దినాలను లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఇప్పటివరకు 40.33 లక్షల పని దినాలు పూర్తయ్యాయి. పనులకు రూ.80.52 కోట్లు ఖర్చయింది. మొత్తం 641 కుటుంబాలు వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. కూలీలు 28,127 పనుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 5,831 పనులు పూర్తి చేశారు.
ఇంకా 22,296 పనులు పురోగతిలో ఉన్నాయి. పంచాయతీల పరిధిలో ప్రస్తుతం 75 పనుల వరకు కొనసాగుతున్నాయి. సాధారణంగా కూలీలు హరితహారంలో మొక్కలు నాటవచ్చు. కాలువలు, చెరువుల్లో పూడిక తీయవచ్చు. పొలాలను చదును చేయవచ్చు. రైతుకల్లాలు ఏర్పాటు చేయవచ్చు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించి వేతనం పొందవచ్చు. కానీ కొత్త నిబంధన ప్రకారం ఒకే సారి కూలీలు 20 పనుల్లోనే పాల్గొనాలి. అవి పూర్తి చేసిన తర్వాతే మరో పని చేపట్టాల్సి ఉంటుంది.
నిబంధనలు అమలు చేస్తున్నాం..
కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను అ మలు చేస్తున్నాం. పంచాయ తీ పరిధిలో పరిమిత స్థాయి లో పనులు జరుగుతాయి. చిన్న చిన్న పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయి. పెద్ద పనులైతే కాస్త ఆలస్యమవుతుంది. కూలీలు ఒక్కో పని పూర్తి చేస్తూ మరొక పనికి వెళ్లాలి. దీంతో కూలీలకు పని దొరికే అవకాశం ఉండదు.
– మధుసూదనరాజు, డీఆర్డీవో, కొత్తగూడెం