ఖమ్మం కల్చరల్, ఆగస్టు 18 : గిరిధారి, గీతాచార్యుడు, నల్లనయ్య, వెన్నదొంగ, సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణపరమాత్ముని జన్మదినాన్ని శుక్ర, శనివారాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోనున్నారు. శ్రీమహా విష్ణువు అవతారంగా శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ బహుళ రోహిణి నక్షత్రయుక్త అష్టమి తిథి నాడు జన్మించాడు. విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట గల పవిత్ర శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడి జన్మదినం జన్మాష్టమిని జిల్లా అంతటా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కృష్ణనామం, పూజలు, శ్రీకృష్ణ వేషధారణలు, ఉట్లు, కోలాటాల ఉత్సవాలతో జిల్లా అంతటా కృష్ణతత్వం ఉట్టిపడనుంది. ఈ మేరకు వైష్ణవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
ఇంటి వాకిళ్లల్లో అందమైన రంగవల్లులతోపాటు చిన్ని కృష్ణుడి పాద ముద్రలను వేసి కన్నయ్యను తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ప్రత్యేక అలంకారంతో గల మండపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి విశేష పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా సకల శుభాలు తెచ్చిపెట్టే శ్రీకృష్ణ వ్రతాన్ని నిష్టతో ఆచరించనున్నారు. వెన్న దొంగకు ప్రీతిపాత్రమైన పలు రకాల పిండి వంటలు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించి శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహానికి పాత్రులు కానున్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినానికి ఉట్లు కొట్టడం ఒక ప్రత్యేకం. శ్రీకృష్ణ మురళీమందిరంతోపాటు టేకులపల్లి గోశాలలో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. యశోదమ్మల సందడి కూడా వాడవాడల్లో మొదలైంది. తల్లిదండ్రులు తమ పిల్లలను కృష్ణుడి, యశోద, గోపికల వేషధారణల్లో ముస్తాబు చేయడంలో నిమగ్నమయ్యారు.