బహుజన బంధువు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఉమ్మడి ఖమ్మంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు వేడుకల్లో పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
మణుగూరు టౌన్, ఆగస్టు 18: తెలంగాణ తొలి సిపాయి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు. మండలంలోని తిర్లాపురంలో గురువారం జరిగిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ఉద్యమంలో అనేకమందిని సైన్యంగా తయారుచేసి తెలంగాణలో మొగలాయి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో సర్దార్ సర్వాయి పాపన్న జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ జయంతిని నిర్వహిస్తోందని గుర్తుచేశారు. మణుగూరు కేంద్రంగా పాపన్న విగ్రహ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, గౌడ సంఘం నాయకులు పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, తాళ్లపల్లి యాదగిరి, పాయం కామరాజు, కంటెం సురేశ్, మేకపోతుల వెంకటేశ్వర్లు, గుండగాని శ్రీను, గుండగాని పెదవెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, ముత్యం రమేశ్, ముత్యం సంతోశ్, ఆకుల పూర్ణచందర్, సురేశ్, సిగ విజయ్, గుండగాని లక్ష్మీనర్సు, ముత్యం లలిత, మేకపోతుల లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఎంపీడీవో కోట వీరబాబు, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావులు కలిసి సర్వాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుడిపూడి కోటేశ్వరరావు, జావేద్పాషా, అడపా అప్పారావు, బాబూజాన్ తదితరులు పాల్గొన్నారు.