సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): వాతావరణంలో మార్పుల కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సీజనల్ వ్యాధుల్లో 70శాతం వరకు వైరల్ ఫీవర్లేనని ధ్రువీకరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. డెంగీ, టైఫాయిడ్ బారిన పడకుండా ఉండాలంటనే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలంటున్నారు. వైరల్ ఫీవర్ లక్షణాలు, కరోనా లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని, ముఖ్యంగా దవాఖానలకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలంటున్నారు.
నీటి కలుషితం, దోమకాటుతోనే ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తాయని, అందుకే ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. కాచి చల్లార్చి వడపోసిన నీటినే వాడాలంటున్నారు. వేడి ఆహారమే తీసుకోవాలంటున్నారు. ఇల్లు, ఇంటి పరిసరాల్లో వాననీరు నిల్వ ఉండకుండా చూడాలి. కలుషిత నీరు తాగొద్దు. కలుషిత ఆహారం తినొద్దు. నిల్వ చేసిన పదార్థాలను దూరంగా ఉండాలి. కూలర్లు, పూల కుండీలు, ఏసీలు, టైర్లలో నీరు నిల్వలేకుండా చూడాలి. దోమ తెరలు వాడాలి. ఆనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వానకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయట ఆహారం తీసుకోకూడదు. ఫాస్ట్ఫుడ్ను పక్కన పెట్టాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
-డాక్టర్ శంకర్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్, హైదరాబాద్