ఖమ్మం, ఆగస్టు 17: జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన దృష్ట్యా ఈ ఏడాది నుంచి తరగతుల ప్రారంభానికి భవనాలు, సౌకర్యాలపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల ఏర్పాట్లపై కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కలెక్టరేట్ భవనాల సముదాయం, ఆర్అండ్బీ కార్యాలయం వైద్య కళాశాలకు కేటాయించినట్లు చెప్పారు. ప్రస్తుతం మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. ఉన్న భవనాలను ఎంత మేరకు ఉపయోగంలోకి తేవచ్చో, ఎంతమేరకు కొత్త భవనాలను ఏర్పాటు చేయాలో కార్యాచరణ రూపొందించాలన్నారు. లైబ్రరీ, అనాటమి ల్యాబ్, ఫిజియోలజీ, లెక్చర్ హాళ్లు, రిసిపెన్ష హాల్ తదితరాలకు ప్రస్తుతమున్న గదుల సవరణలు చేపట్టి ఉపయోగంలోకి తేవాలని సూచించారు. ఆర్అండ్బీ ఎస్ఈ లక్ష్మణ్, ఈఈ శ్యామ్ప్రసాద్, టీఎస్ఎంఐడీసీ ఈఈ ఉమామహేశ్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.