నెట్వర్క్, ఆగస్టు 9 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆదివాసీల మనుగడ సాధ్యమైందని వక్తలు పేర్కొన్నారు. వారి అభివృద్ధితోపాటు విద్య, వైద్యం, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం ఘనంగా జరిగాయి. అన్ని చోట్లా కుమ్రం భీం విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు. మణుగూరులో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, దమ్మపేటలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. భద్రాచలంలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు మాట్లాడారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న గిరిజన అమరవీరుల స్థూపాలకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.