చేపలు పడితేనే వారికి పూట గడిచేది.. దశాబ్దాలుగా వారు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు.. చేపల వేటే ఆధారంగా జీవిస్తున్నారు.. తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.. పిల్లలను చదివించుకుంటున్నారు.. కులవృత్తిని కాపాడుకుంటున్నారు.. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన మత్స్యకారులకు నాలుగేళ్లుగా చేయూతనందిస్తున్నారు సీఎం కేసీఆర్. చెరువుల్లోకి వందశాతం రాయితీతో చేపపిల్లలు వదులుతున్నారు.. రాయితీపై చేపల వలలు, ఆటోలు, ట్రాలీలు, వ్యాన్లు అందిస్తున్నారు.. మత్స్యకారులకు బీమా అమలు చేస్తున్నారు.. వారి కుటుంబాలకు భరోసానిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వానలు దండిగా కురవడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వారం రోజుల్లో 1,129 చెరువుల్లో 3.62 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు.
ఖమ్మం, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేపల వేటపై ఆధారపడి జీవించేవారు మత్స్యకారులు. వందలాది ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్న బడుగు జీవులు. కులవృత్తిలో కొనసాగుతూ మరో పని తెలియని నిరుపేదలు. చేపలు అమ్ముకుని వచ్చిన ఆదాయంపైనే బతికే జీవులు. దీనిపై వచ్చిన ఆదాయంతోనే కుటుంబ పోషణ, పిల్లల చదువూ అన్నీ. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన మత్స్యకారులను అక్కున చేర్చుకున్నది తెలంగాణ ప్రభుత్వం. వారికి రాయితీలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనందిస్తున్నది. చెరువుల్లో చేపల పెంపకానికి 100 శాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేస్తున్నది. నాలుగేళ్లుగా ఏటా ఇదే ప్రక్రియ కొనసాగిస్తున్నది. దీనిలో భాగంగా ఈ ఏడాది చేపల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వానలు దండిగా కురవడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వారం రోజుల్లో 1,129 చెరువుల్లో 3.62 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు.
మత్స్యకారులకు అండగా సర్కార్..
మత్స్యకారుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం బీమాను రూ.5 లక్షలకు పెంచింది. చేపలను మార్కెటింగ్ చేసుకునేందుకు రాయితీపై ద్విచక్రవాహనాలు, ఆటోలను రాయితీపై అందించింది. మత్స్య సొసైటీలను బలోపేతం చేసేందుకు చెరువుల్లోకి ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తున్నది. నాలుగేళ్లుగా ఇవన్నీ అమలు చేయడంతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. ఈఆర్థిక సంవత్సరంలో రూ.2.71 కోట్లతో ప్రభుత్వం జిల్లాలోని 1,129 చెరువుల్లో పూర్తి రాయితీతో చేపపిల్లలు వదలనున్నది.
వేలాది కుటుంబాలకు ప్రయోజనం..
చేపపిల్లల పంపిణీతో జిల్లావ్యాప్తంగా 189 సొసైటీల పరిధిలో 14,888 మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. జిల్లా వైశాల్యం, నీటి వనరులతో పోల్చుకుంటే మత్స్యసంపద జిల్లావాసులకు తగినట్లు గానే ఉంది. సాధారణంగా సగటున సంవత్సరానికి ప్రతి మనిషికి 8 నుంచి 12 కిలోల చేపల అవసరం ఉంటుందని నిపుణుల అంచనా. జిల్లాలోని 1,129 చెరువుల నుంచి ఏటా 20 వేల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతాయి. జిల్లాలో చేపల ఉత్పత్తికి ప్రధాన వనరులు పాలేరు, వైరా, లంకాసాగర్, బేతుపల్లి రిజర్వాయర్లు. చెరువులు, కుంటలు కలిపి జిల్లావ్యాప్తంగా 17,039 హెక్టార్ల విస్తీర్ణం, పంచాయతీల పరిధిలోని కుంటలు మరో 8,867 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి.
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా టాప్..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం చేపల ఉత్పత్తిలో ఉమ్మడిజిల్లా 3వ స్థానంలో ఉంది. ఈసారి 2వ స్థానంలోకి చేరే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథలో భాగంగా చెరువులను పునరుద్ధరించడంతోనే ఈ విజయం సాధ్యమైంది. మరోవైపు మత్స్యకారులకు రాయితీలపై వలలు, తెప్పలు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, డీసీఎంలు అందివ్వడంతో వారి ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది.
వారం రోజుల్లో చేపపిల్లల పంపిణీ..
చేప పిల్లల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే టెండర్ ప్రక్రియ ముగిసింది. జిల్లావ్యాప్తంగా 1,129 చెరువుల్లో ఈ సంవత్సరం చేప పిల్లలు వదలాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు 3.62 కోట్ల చేప పిల్లలు అవసరం ఉంటుంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
– ఆంజనేయులు, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం