ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23అడుగులు కాగా ఆదివారం 23.8 అడుగులకు చేరింది. పాలేరు గేట్లను తెరిచి కిందకు నీటిని వదులుతున్నారు. వైరా రిజర్వాయర్ నీటిమట్టం 19.8 అడుగులకు చేరుకున్నది. వైరా ఏరు పొంగి ప్రవహిస్తున్నది. సిరిపురం, లక్ష్మీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరు ప్రాజెక్టు 17గేట్లు ఎత్తి 1,13,554 కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
కిన్నెరసాని పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా 403.3 అడుగులకు చేరింది. పాల్వంచ మండలంలోని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మొర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కొణిజర్ల మండలంలోని పగిడేరు వాగు బ్రిడ్జి మీద గుండా ఉధృతంగా ప్రవహించింది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వైపు వెళ్లే వాహన రాకపోకలను పోలీసులు నిలుపుదల చేసి దారి మళ్లించారు.
పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 16 అడుగులు కాగా 17.5 అడుగులకు నీరు చేరడంతో అలుగు పోస్తున్నది. తల్లాడ మండలంలోని బిల్లుపాడు, కొత్తవెంకటగిరి, రామచంద్రాపురం గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లగూడెం, మంగాపురం మధ్య జూబంధం వాగు రోడ్డు చప్టాపై నుంచి నీరు ప్రవహించడంతో ఆర్అండ్బీ రోడ్డు కొట్టుకుపోయింది. దుమ్ముగూడెం మండలవ్యాప్తంగా ఆదివారం 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.