ఖమ్మం, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా ప్రజల కల నెరవేరింది. నిరీక్షణకు తెరపడింది. ఇచ్చిన హామీ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కృషి ఫలిచింది. ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణానికి రూ.166 కోట్లు విడుదల చేసింది. అంతేకాదు, ఈ విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నది. ఈ మేరకు వంద మెడికల్ సీట్లను కేటాయిం చింది. విద్యార్థుల తరగతుల నిర్వహణ, ప్రొఫెసర్లు, నర్సింగ్ కళాశాలకు అనువుగా ఉన్న ప్రస్తుత కలెక్టరేట్ భవనాల సముదాయం, ఆర్అండ్బీ శాఖలకు సంబంధించిన స్థలాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించనున్నది. ఇచ్చిన హామీ అనతి కాలంలోనే నెరవేరడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఖమ్మానికి మెడికల్ కళాశాల..’ ఇదీ జిల్లా ప్రజల చిరకాల కోరిక. ‘రైతులు గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అత్యధికంగా ఉన్న మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేవలం నెలల వ్యవధిలోనే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యకళాశాలకు అనుసంధానంగా మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా మెడికల్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. నూతన భవనాల నిర్మాణాల నిమిత్తం ఏకంగా రూ.166 కోట్లు విడుదల చేయడం గమనార్హం. వీటితో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కళాశాలను ప్రారంభించాలనే లక్ష్యంతో వంద మెడికల్ సీట్లను కేటాయించి జిల్లాపై తనకున్న ఉదారతను ముఖ్యమంత్రి కేసీఆర్ చాటిచెప్పారు. సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కలెక్టరేట్ భవనాల అప్పగింతకు అడుగులు..
జిల్లాకేంద్రంలోపి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అనుబంధంగా మెడికల్ కళాశాల మంజూరు చేసిన సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల తరగతుల నిర్వహణ, నర్సింగ్ కళాశాలకు అనువుగా ప్రస్తుత కలెక్టరేట్ భవనాల సముదాయం, ఆర్అండ్బీ శాఖలకు సంబంధించిన స్థలాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సర్కారు దవాఖాన పరిధి సుమారు 30 ఎకరాల వరకు చేరవచ్చని వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కళాశాల నూతన భవనాల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంస్థ వైద్య విధాన పరిషత్ చేపట్టింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
మంత్రి అజయ్ కృషికి నిదర్శనం..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి సాధారణ ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్కుమార్ గెలిచారు. నాటికి నగరంలోని పెద్దాసుపత్రి కేవలం 300 పడకలతో అరకొర వసతులు ఉండేది. ఆస్పత్రి దృష్టి సారించి సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో 200 పడకల మాతాశిశు సంక్షేమ భవనాన్ని పూర్తి చేయించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పువ్వాడ అజయ్. ఆస్పత్రికి క్యాథ్లాబ్ వంటి ఎన్నో రకాల ఆధునిక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేయగా సీఎం యుద్ధప్రాతిపధికన కళాశాల మంజూరు చేశారు. అంతేకాదు మౌలిక వసతుల కల్పనకు రూ.166 కోట్లు కేటాయించారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో సహకరిస్తున్నారు. జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. మౌలిక వసతలు కల్పనకు భారీగా నిధుల కేటాయించారు. సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఉమ్మడి పాలనలో జిల్లా అన్నిరంగాల్లో వెనుకబడింది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లా అభివృద్ధికి చిరునామాగా మారింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో గతంలో కంటే ఇప్పుడు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్