ఖమ్మం, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొ‘రేట్’ పాఠశాలలకు దీటుగా సర్కారు బడిలో విద్యనందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్లమాధ్యమానికి శ్రీకారం చుట్టి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నది. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందించడంతోపాటు వారి కడుపు నింపేందుకు ‘మధ్యాహ్న భోజనం‘ అందిస్తున్నది. నాణ్యమైన భోజనం అందించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నిర్వాహకులు వంట వండిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులు రుచి చూశాకే విద్యార్థులకు భోజనం వండిస్తున్నారు. అంతేకాకుండా, ఈ విద్యాసంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనంలో ఫోర్టిఫైడ్ రైస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాహార లోపం నివారించేందుకు విద్యార్థులకు సమతుల ఆహారం అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థి భోజనానికి గతంలో రూ.4.13 విడుదలయ్యేవి. ఇప్పుడు ప్రభుత్వం దానిని రూ.6.13 చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్కో విద్యార్థి భోజనానికి రూ.8.13 అందిస్తున్నది. గతంలో ఒక గుడ్డుకు రూ.4 ఇవ్వగా ఇప్పుడు దానిని రూ.5కు పెంచింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం ‘మధ్యాహ్న భోజన’ పథకాన్ని అమలు చేస్తున్నది. తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లో సరైన భోజనం పెట్టలేకపోవచ్చు.. సమతుల ఆహారం అందించేందుకు ఆర్థిక స్థితిగతులు సహకరించకపోవచ్చు.. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ‘మిడ్ డే మీల్స్’ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నది. నిర్వాహకులు వంట వండిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులు రుచి చూశాకే విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. మధ్యాహ్న భోజనం విషయంలో రాజీ లేకుండా ఈ విద్యాసంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనంలో ఫోర్టిఫైడ్ రైస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.ఈ బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాహార లోపం నివారించేందుకు విద్యార్థులకు సమతుల ఆహారం అందిస్తున్నది. ఖమ్మం జిల్లాలో పథకం అమలవుతున్న తీరుపై ప్రత్యేక కథనం.
టీచర్లు రుచి చూశాకే…
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల లోపు ఆరోజు బడికి వచ్చిన విద్యార్థుల సంఖ్యను లెక్కిస్తారు. సమాచారాన్ని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు అందిస్తారు. సంఖ్యను బట్టి మధ్యాహ్నం లోపు నిర్వాహకులు వంటలు పూర్తి చేసి పాఠశాలకు పంపించాల్సి ఉంటుంది. ఆహారాన్ని ముందుగా ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు రుచి చూస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తెలుసుకోకుండా వంట చేస్తే కొన్నిసార్లు లోటుపాట్లు జరిగేవి. కొన్నిసార్లు విద్యార్థులు తక్కువ సంఖ్యలో వస్తే వండిన పదార్థాలను పడేయాల్సి వచ్చేది. ఇలాంటి నష్టాల నివారణపై రాష్ట్ర విద్యాశాఖ సమాలోచనలు చేసి విద్యార్థుల హాజరు సంఖ్యను బట్టి వంట చేయించాలని నిర్ణయించింది. ఒక్కో విద్యార్థికి ప్రతిరోజూ 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల పప్పు, 75 గ్రాముల కూరగాయలు.. ఇలా నిర్వాహకులు పక్కాగా నిబంధనలు పాటించాల్సి ఉంది.
నిధుల్లో జాప్యం లేదు…
మధ్యాహ్న భోజనం అందించే నిర్వాహకులకు గతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిధులు విడుదలయ్యేవి. ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి నిధులు విడుదలవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థి భోజనానికి గతంలో రూ.4.13 విడుదలయ్యేవి. ఇప్పుడు ప్రభుత్వం దానిని రూ.6.13 చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థి భోజనానికి రూ.8.13 అందిస్తున్నది. గతంలో ఒక గుడ్డుకు రూ.4 ఇవ్వగా ఇప్పుడు దానిని రూ.5కు పెంచింది.
భోజనం బాగుంది..
మా పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతున్నది. ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత మళ్లీ అడిగినా పెడతారు. మేం ఆకలి తెలియకుండా చదువుకున్నాం. టీచర్లు నిత్యం ఆహార నాణ్యతను పరిశీలిస్తారు. వారంలో మూడు రోజులు కోడి గుడ్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో అందించే కూరలు చాలా బాగుంటున్నాయి.
– ఎస్కే అశ్మిత, 9వ తరగతి, జడ్పీఎస్ఎస్ కొదుమూరు
నాణ్యమైన భోజనం అందుతున్నది..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతున్నది. ప్రధానోపాధ్యాయుల నుంచి ఉపాధ్యాయుల వరకు నిత్యం మధ్యా హ్న భోజనాన్ని పరిశీలిస్తున్నారు. స్వయంగా రుచి చూస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనంపై చాలా సంతోషంగా ఉన్నారు.
– పోటు శ్రీను, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీహెచ్ఎస్ కొదుమూరు