ఖమ్మం, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ ధ్యాసే శ్వాసగా బతికారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఖమ్మంలో శనివారం నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఖమ్మంలోని 16వ డివిజన్ కొత్తూరు వద్ద గల జయశంకర్ సార్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
అందుకు గుర్తుగానే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామని జ్ఞప్తికి తెచ్చారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు జ్యోతి, మల్లీశ్వరి, లక్ష్మీప్రసన్న, కమర్తపు మురళి, వెంకటేశ్వర్లు, పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి, లింగాల రవికుమార్, పాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వేడుకలు జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, ఇల్లెందుల్లో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, ఖమ్మంలో జడ్పీ చైర్మన్ కమల్రాజు తదితరులు ప్రొఫెసర్కు నివాళులర్పించారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలోని జయశంకర్ సార్ విగ్రహానికి కూడా నేతలు పూలమాలలు వేశారు.