మామిళ్లగూడెం, ఆగస్టు 6: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రానైట్ పరిశ్రమలను కాపాడుకుంటామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నగరంలోని హరిత గార్డెన్స్లో శనివారం రాత్రి ‘ది ఖమ్మం గ్రానైట్స్ స్లాబ్ ఫ్యాక్టరీస్ ఓనర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు ఉప్పల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ద్వారా జిల్లాలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. అన్ని పరిశ్రమల కంటే గ్రానైట్స్ పరిశ్రమ పెద్ద పరిశ్రమగా మనుగడ కొనసాగిస్తున్నదన్నారు. తెలంగాణ సాధించుకున్న గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నదన్నారు. ప్రధానంగా విద్యుత్ రంగంలో ఎన్నో మార్పులు తెచ్చిందన్నారు. పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నదన్నారు. పరిశ్రమలకు 40 శాతం రాయితీ కొనసాగించి మరింత బలాన్ని చేకూర్చిందన్నారు.
కరోనా కాలంలో పరిశ్రమ అధినేతలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. మఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలోని పెద్ద క్వారీల ద్వారా నాణ్యమైన రాయి విదేశాలకు తరలిపోతున్నదన్నారు. స్థానిక పరిశ్రమలకు మాత్రం రాయి దొరకడం లేదన్నారు. త్వరలోనే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి క్వారీలకు అనుమతులు తెచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. ఉపాధి, పెట్టుబడులకు కేంద్రమైన గ్రానైట్ పరిశ్రమలను ప్రభుత్వ ఆదుకుంటుందన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు బాగం హేమంతరావు, ఎంఎల్ ప్రజాప్రంథా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రానైట్ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి తమ మద్దుతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సంఘం రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, పుసలూరి నరేంద్ర, యలమద్ది శ్రీనివాసరావు, చిన్ని కృష్ణరావు, పార నాగేశ్వరరావు, సాధు రమేశ్రెడ్డి, వేముల రవికుమార్, తమ్మినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కార్యవర్గం ఇదీ..
సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉప్పల వెంటరమణ, ప్రధాన కార్యదర్శిగా ఎన్.శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా డి.రాజేశ్, ఉపాధ్యక్షులుగా ఖాసీం, కె.వీరభద్రరావు, సహాయ కార్యదర్శులుగా రఘురాంరెడ్డి, టి.వాసు, కార్యవర్గ సభ్యులుగా లాల్ ప్రతాప్, రియాజ్, రంగారావు, నాగేశ్వరరావు, రవికుమార్ ఎన్నిక కాగా వారితో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి రామారావు ప్రమాణ స్వీకారం చేయించారు.