భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ) : నాడు ఉమ్మడి జిల్లాలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం.. నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. శనివారం కొత్తగూడెం క్లబ్లో సీఈవో విద్యాలత అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ పాలక మండలి మూడేళ్ల ప్రగతి సమీక్షలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి మన్యం ఇప్పుడు అభివృద్ధి గుమ్మంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణలో అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతున్నాయని పేర్కొన్నారు. చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. సీతారామ, సీతమ్మ సాగర్ సాగునీటి ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలంగా మారనున్నదన్నారు. జిల్లా పరిషత్కు రూ.వేల కోట్ల నిధులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా విడుదల చేస్తున్నదని, వీటితో మారుమూల ప్రాంతాలకు రహదారుల సౌకర్యం మెరుగైందన్నారు.
ప్రతి ఊరులో బీటీరోడ్ నిర్మాణాలు జరిగాయని, త్వరలో కలెక్టరేట్, మెడికల్ కాలేజీ ప్రారంభం కానున్నదని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో రెండు జిల్లాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. రామవరంలోని గైనిక్ సెంటర్ ఇప్పుడు కార్పొరేట్ స్థాయిని మించి పోయిందని అన్నారు. మూడేళ్లలో ప్రజాప్రతినిధుల సహకారం మరువలేనిదన్నారు.
జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జడ్పీ చైర్మన్గా రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు చైర్మన్ కనకయ్యను సత్కరించారు. సమీక్షలో డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో రమాకాంత్, ఆర్అండ్బీ ఈఈ బీమ్లా, ఈఈ సుధాకర్, డీపీఆర్వో శీలం శ్రీనివాసరావు, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి,డీడబ్ల్యూవో వరలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారస్వామి, ఇతర శాఖల అధికారులు, ఎంపీపీలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.