ఖమ్మం రూరల్, జూలై 27: పండ్ల తోటల సాగుపై ఖమ్మం జిల్లా రైతులు కొన్నేళ్ల నుంచి ఆసక్తికనబరుస్తున్నారు. సాధారణ పంటలకు స్వస్తి పలికి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే ఉద్యాన పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటివరకు ఏపీకే పరిమితమైన పండ్ల తోటల సాగు ఇప్పుడు జిల్లాలోనూ ఊపందుకున్నది. సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, ఎర్రుపాలెం మండలాలకు చెందిన కొందరు రైతులు టిష్యూ పద్ధతిలో 342 ఎకరాల్లో అరటి సాగు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. సాగుకు అవసరమైన సాగునీరు పుష్కలంగా ఉండడం, భౌగోళిక, వాతావరణ పరిస్థితులు అనూకూలంగా ఉండడంతో రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో సాగువిస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ఉద్యానశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరిస్తున్నారు. ఆసక్తి కలిగిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
రాయితీలు.. సాగు విధానం ఇలా..
టిష్యూ పద్ధతిలో అరటి సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, రాయితీలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ గుర్తింపు పొందిన టిష్యూ ల్యాబ్ల నుంచి తెచ్చిన మొక్కలు నాటాల్సి ఉంది. లేదా ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేస్తే సదరు రశీదులను అధికారులకు అందజేయాల్సి ఉంది. ఒక్కో రైతు 10 ఎకరాల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. హెక్టార్కు సాగు ఖర్చు రూ.1,02,462 అవుతుండగా ప్రభుత్వం రెండు విడతల్లో 40శాతం రాయితీ అంటే రూ.40,985 అందిస్తుంది. మొదటి సంవత్సరం రూ.30,739, రెండో సంవత్సరం రూ.10,246 అందుతుంది. రైతులకు హెక్టార్కు 3,086 మొక్కలను 1.8X1.8 మీటర్ల దూరం పాటిస్తూ నాటుకోవాలి.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
టిష్యూ కల్చర్ పద్ధతిలో అరటి సాగుతో రైతులు ఆశించిన దిగుబడులు పొందవచ్చు. సాగుపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ రాయితీలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పద్ధతిలో పంటకు చీడపీడల తాకిడి తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సత్తుపల్లి ప్రాంతంలో మాత్రమే పంట సాగవుతున్నది. మిగిలిన ప్రాంతాల రైతులూ ఆసక్తి కనబరిస్తే వారికి సాగుపై అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ రాయితీలు అందేలా చూస్తాం.
– జి.అనసూయ, జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమశాఖ అధికారి, ఖమ్మం