భద్రాచలం, జూలై 25: భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామకోటి పుస్తకాలను సోమవారం నిమజ్జనం చేశారు. భక్తులు భద్రాద్రి రామయ్యకు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను ఏటా శ్రావణ మాసంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలోని గోదావరిలో నిమజ్జనం చేస్తుంటారు. ఈ ఏడాది కమిషనర్ ఆదేశాల మేరకు ఆషాఢ మాసంలో నిమజ్జనం చేశారు. ఈ ఏడాది ముందుగా గోదావరికి వరదలు రావడంతో ఆషాఢ బహుళ ద్వాదశి రోజున నిండు గోదావరిలో రెండు లారీల్లో తెచ్చిన రామకోటి పుస్తకాలను నిమజ్జనం చేశారు. ముందుగా ఆలయం వద్ద రామకోటి పుస్తకాలకు విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యాహవాచన చేసి, తీర్థ జలాలను శ్రీరామకోటి పుస్తకాలను ఉంచిన రెండు వాహనాలపై ప్రోక్షించారు. అనంతరం దేవస్థానం ఈవో శివాజీ దంపతులు, అర్చకులు ఆ పుస్తకాలకు పూజలు చేసి నారికేళాలు సమర్పించారు. తరువాత అర్చకులు దేవస్థానం ఈవోకు పరివట్టం కట్టి, శిరస్సుపై రామకోటి పుస్తకాలను ఉంచి శ్రీరామ రామేతి, రమే రామే ధ్యాన శ్లోకాన్ని పఠింపజేసి పుస్తకాలను నిమజ్జనం చేశారు. ఆలయ ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, వేద పండితులు సన్యాసి శర్మ తదితరులతోపాటు ఈవో సీసీ అనీల్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.