భద్రాచలం, జూలై 23: ఇరువురు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.లక్ష నగదు, మోటర్సైకిల్, విప్లవ సాహిత్యం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. శనివారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం దుమ్ముగూడెం ఎస్సై రవికుమార్, 141 బెటాలియన్, పోలీసు సిబ్బంది చిన్ననల్లబల్లి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి మోటర్సైకిల్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు.
వీరిలో ఒకరు ఏలూరు జిల్లా ఈదర గ్రామానికి చెందిన మొగదటి నాగయ్య. ఇతడు భద్రాచలంలోని రాజుపేటకాలనీలో నివసిస్తున్నాడు. మరొకరు చుంచుపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన పుల్లూరి శ్రీహరిబాబుగా గుర్తించారు. వీరు కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి . డబ్బులు, సరుకులు సరఫరా చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పార్టీ ఆదేశాలపై ఇసుక కాంట్రాక్టర్ గొర్రెల బుచ్చిరాజు నుంచి రూ.లక్ష నగదు, రామవరానికి చెందిన రామగిరి నాగరాజు నుంచి విప్లవ సాహిత్య పుస్తకాలను సేకరించి పార్టీకి అందజేసేందుకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు పంపించారు.