భద్రాచలం, జూలై 19: వరదలు తగ్గుముఖం పట్టడంతో అంటు వ్యాధులు వ్యాపించకుండా పారిశుధ్యం, వైద్యసేవలపై ప్రత్యేక దృష్టిసారించామని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ‘పారిశుధ్య కార్యక్రమాలు – వైద్య సేవల నిర్వహణ’పై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జీ.శ్రీనివాసరావుతో కలిసి భద్రాచలంలోని ఐటీడీఏ మీటింగ్ హాల్లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరద ఉధృతంగా ప్రవహించినప్పటికీ ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగామని అన్నారు. వరదల వల్ల 8 మండలాల్లో 240 గ్రామాలకు విద్యుత్ సేవలు నిలిచిపోయాయని, కానీ ఇప్పటికే 230 గ్రామాలకు విద్యుత్ను పునరుద్ధరించామని అన్నారు. భద్రాచలంలో 49 అడుగులు వరద వస్తేనే పట్టణంలోని వరద నీరు చేరుతుందని, 71.40 అడుగులు వచ్చినా సింగరేణి సహకారంతో 1800 హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నామని అన్నారు. మూడు ఇంటేక్వెల్స్ ముంపునకు గురికాగా, వాటిల్లో రెండింటిని పునరుద్ధరించినట్లు చెప్పారు.
మరోదానికి హైదరాబాద్ నుంచి మోటార్లు తెప్పించి రన్నింగ్లో పెట్టామన్నారు. 1300 గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోగా.. 1100 గ్రామాల్లో సరఫరాను ప్రారంభించామని, మిగిలిన 200 గ్రామాల్లో బుధవారం నాటికి సరఫరా చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు, నూనె తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ముంపు బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో గణన చేపట్టామన్నారు. ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని తెప్పించి ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపడుతున్నామన్నారు.
యజ్ఞంలా పారిశుధ్య పనులు..పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు
4,100 మంది కార్మికులతో యజ్ఞంలా పారిశుధ్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజారోగ్యం, పారిశుధ్య కార్యక్రమాలు ముఖ్యమని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1986 తరువాత పెద్దఎత్తున వరద వచ్చినా.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో ప్రాణనష్టం జరుగలేదన్నారు.
రాత్రికి రాత్రి 60లారీల ఏర్పాటు చేసి ప్రజలను ముంపు నుంచి పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణ సమయంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నామన్నారు. 45గ్రామ పంచాయతీలు వరద ముంపుకు గురయ్యాయని, జీహెచ్ఎంసీ నుంచి అనుభవజ్ఞులైన పారిశుధ్య పనివారిని తెప్పించి, వారి సేవలను వినియోగించుకుంటున్నామని చెప్పారు. సీనియర్ అధికారులు సురేశ్కుమార్, రవీందర్రెడ్డితోపాటు మరో ఐదుగురు డీపీవోలను డిప్యూటేషన్పై భద్రాచలం రప్పించినట్లు చెప్పారు.
ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించేలా ప్రతి ఇంటికి ఆరోగ్య సూచనలతో కూడిన కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యాధుల నియంత్రణ చర్యలో భాగంగా ప్రతి ఇంటికెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 10,276 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అత్యవసర వైద్యసేవల కోసం 24 గంటలు పనిచేసేలా 040-24651119 నంబర్తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, అత్యవసర సేవలు అవసరమైనవారు ఈ నంబర్కు కాల్ చేయాలని చెప్పారు.
వరదల సమయంలో 106 మంది గర్భీణులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించామని, 60 మందికి శస్త్ర చికిత్సలు, 36 మందికి సాధారణ ప్రసవం చేశామన్నారు. మిగిలిన 10మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ప్రజలు కాచి, చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడకుండా ఉంటారన్నారు. అత్యవసర వైద్య సేవలకు 108వాహనాలు సిద్ధంగా ఉంచామని, ప్రతి ఇంటికి క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు.విపత్తు సమయంలో ప్రజలు అధికారులకు సహకరించాలని చెప్పారు.