కొత్తగూడెం క్రైం, జూలై 5: సైబర్ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి ఉందని జిల్లా ఎస్పీ వినీత్ జి అన్నారు. మంగళవారం తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీస్ అధికారుతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల బారినపడి నగదు కోల్పోయిన బాధితులకు సత్వరమే న్యాయం చేయడమే కాకుండా, ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ శాఖలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాగాళ్లను కనిపెట్టే విధంగా ఐటీ కోర్ అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి ఆ బ్లాక్ స్పాట్స్ను జియో ట్యాగింగ్ ద్వారా ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని తెలిపారు. గంజాయి, గుట్కా, మట్కా, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తుల పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు నవీకరణ చేయాలని ఆదేశించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించే వ్యక్తుల వివరాలను సైతం సేకరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారికి న్యాయం జరిగేలా ప్రతి అధికారి, సిబ్బంది పని చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) కే.ఆర్.కే ప్రసాద్, డీసీఆర్బీ డీఎస్పీ నందిరామ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ నాగరాజు, పీఆర్వో దాములూరి శ్రీనివాస్, ఎస్సైలు కార్తిక్, హారిక, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులను అభినందించిన ఎస్పీ
కొత్తగూడెం క్రైం, జూలై 5: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై ‘పోకో’ యాక్టు కేసు నమోదు చేసి, నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ వినీత్ జి అభినందించారు. 2019 మే నెలలో కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తుడిపై అప్పటి ఇన్స్పెక్టర్ కన్నం కుమారస్వామి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణాధికారిగా వ్యవహరించిన అప్పటి డీఎస్పీ ఎస్ఎం అలి విచారణలో సంపాదించిన అన్ని సాక్షాధార్యాలను కోర్టుకి సమర్పించారు. ఈ కేసు పూర్వాపరాలను, సాక్షాధారాలను పరిశీలించిన అనంతరం కొత్తగూడెం ఒకటవ అదనపు, ఫస్ట్క్లాస్ సెషన్స్ జడ్జి నిందితుడికి 25సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.13 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన కొత్తగూడెం ప్రస్తుత డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వరబాబు, వన్టౌన్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే రామారావు, కోర్టు డ్యూటీ అధికారులు హెడ్ కానిస్టేబుల్ ఎం. హరగోపాల్, కానిస్టేబుల్ కరీముద్దీన్లను ఎస్పీ తన కార్యాలయంలో అభినందించారు.