అశ్వారావుపేట టౌన్/ కామేపల్లి/ చండ్రుగొండ, జూలై 5: మూస పద్ధతిలో సాగే వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ నూతన విధానాలను అమలు చేసి చూపిస్తున్నారు ఓ ముగ్గురు యువ రైతులు. ఇందులో అధిక లాభాలు ఆర్జించడమే కాకుండా ఇతర పంటల సాగు ఆవశ్యకతనూ తెలియజేస్తున్నారు. సంప్రదాయ పంటల్లో సరికొత్త పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. సరైన అవగాహనతో ముందుకు సాగుతూ లాభాలు గడిస్తున్నారు. మెళకువలు పాటిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. కౌలు వ్యవసాయాన్ని సైతం లాభాల బాట పట్టిస్తున్నారు.
అప్పులు తీర్చి.. పెట్టుబడులు సమకూర్చి..
మిరపసాగు చేసి అధిక దిగుబడులు సాధించాడు చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన రైతు గాలం రవి. సాగు కోసం అయిన అప్పులను తీర్చడమే కాకుండా వ్యవసాయానికి సొంతంగా పెట్టుబడి పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. తనకున్న నాలుగున్నర ఎకరాల్లో నిరుడు మిరప పంటను సాగు చేశాడు. పెట్టుబడులు రూ.3.50 లక్షలు అయ్యాయి. పంట బాగా చేతికందడంతో పెట్టుబడిపై రూ.2 లక్షల వరకూ లాభం ఆర్జించాడు. దీంతో ఈ ఏడాది తనకున్న మొత్తం పొలంలో మిరపను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పత్తి, వరి పంటలకు భిన్నంగా మిరపను సాగు చేయడం వల్ల లాభాలు వచ్చాయని చెబుతున్నాడు ఆ రైతు.
ఒక్కసారి పెట్టుబడితో..
ఒక్కసారి పెట్టుబడి పెట్టి 20 ఏళ్ల వరకూ ఆదాయం పొందేలా ముందుకు సాగుతున్నాడు. కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన రైతు గంగారపు సత్యనారాయణ. తనకున్న రెండెకరాల్లో మూస పద్ధతిలో వ్యవసాయం చేసి నష్టాలను చవిచూసి అతడు.. ఆ పద్ధతికి స్వస్తి పలికాడు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు దృష్టి మళ్లించాడు. ఈ క్రమంలో డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేశాడు. రెండెకరాల్లో సుమారు రూ.8 లక్షలు ఖర్చు చేసి దాని సాగు మొదలు పెట్టాడు. ఏడాదిన్నర తర్వాత పూలు పూసి కాయలు కాశాయి. రెండేళ్లలో పంట దిగుబడి ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే వచ్చింది. మార్కెట్లో పంటకు మంచి డిమాండ్ ఉండడంతో కేజీ రూ.200 చొప్పున విక్రయిస్తున్నాడు. మొక్కల నుంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రూల్లింగ్ విధానం ద్వారా మొక్కలను పెంచి రైతులకు అమ్ముతూ అదనపు ఆదాయం ఆర్జిస్తున్నాడు.
బెంగ తీర్చిన ‘బెండ’..
అశ్వారావుపేట పట్టణానికి చెందిన పంచకర్ల సురేశ్బాబు ఎనిమిదేళ్లుగా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మొదట్లో వరి సాగపై పూర్తిగా దృష్టిపెట్టినప్పటికీ ఆశించినంత దిగుబడులు రాలేదు. దీనికి తోడు తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయబోనంటూ కేంద్రం చేతులెత్తేయడంతో ఇతడు కూడా ప్రత్యామ్నాయంగా దిశగా ఆలోచించాడు. మొక్కజొన్నతోపాటు కూరగాయల సాగుపై దృష్టిపెట్టాడు. ఆర్థికంగా మొదట్లో కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ తరువాత నిలదొక్కుకున్నాడు. కూరగాయల సాగులో ఏడాదికి రూ.4 లక్షల వరకు ఆదాయాన్ని గడిస్తున్నాడు. ముఖ్యంగా బెండ సాగు అతడి బెంగ తీర్చింది. వంగ సాగు సైతం అధిక లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ సాగుపై పూర్తిగా పట్టు సాధించాడు. కూలీల ఖర్చు పోను నాలుగు ఎకరాలకు ఏడాదికి రూ.నాలుగు లక్షలు మిగులుతున్నాయని సంతోషంగా చెబుతున్నాడీ యువ రైతు. మొక్కజొన్నను ఆరు ఎకరాల్లో సాగు చేస్తూ వాతావరణ పరిస్థితులను బట్టి ఏడాదికి ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు చెబుతున్నాడు.
చీడపీడల బెడద లేదు..
అనేక ఏళ్ల్లుగా పత్తి పంటను సాగు చేసే వాణ్ని. దుక్కి దున్నడం, విత్తనాలను నాటడం నుంచి పంట చేతికొచ్చే వరకు రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చేది కాదు. పూత, కాత దశలో విపరీతంగా చీడపీడలు ఆశించేవి. వచ్చిన కొద్దిపాటి పంట దిగుబడికీ మార్కెట్లో ధర లభించేది కాదు. దీంతో డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు కదిలాను. దీనికి చీడపీడల బెడద ఉండదు. రాదు. మార్కెటింగ్ సులవుగా ఉంటుంది.
-గంగారపు సత్యనారాయణ, రైతు, గోవింద్రాల, కామేపల్లి
పూర్తిగా కౌలు వ్యవసాయమే..
సుమారు 15 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎకరానికి రూ.20 వేల కౌలు వెచ్చిస్తున్నా. కుటుంబ సభ్యుల సహకారంతో కూలీల సమస్యను కొంత వరకూ అధిగమించా. కూలి రేట్లు అధికంగా ఉండడంతో దిగుబడి ఉన్నప్పటికీ పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్న కారణంగా నీటి తడులకు ఎటువంటి ఇబ్బందులూ లేవు. కౌలు వ్యవసాయమే అయినా కూరగాయలు, మొక్కజొన్న సాగు బాగుంది.
-పంచకర్ల సురేశ్బాబు, కౌలు రైతు, అశ్వారావుపేట
అప్పులు తీరాయి..
మిరపను సాగు చేయడం వల్ల అప్పులు తీరాయి. దీంతో ఈ ఏడాది కూడా మళ్లీ మిరపను సాగు చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ను ఇస్తుండడం వల్ల నీటి కష్టాలు తొలగాయి. మిరపను సాగు చేయడం వల్ల ఇతర పంటల కంటే లాభాలు అధికంగా వస్తున్నాయి. నిరుడు మిర్చి పంటను చీడపీడలు బాగా ఆశించడంతో దిగుబడిపై చాలా ప్రభావం చూపింది. అలాంటప్పుడు మెళకువలు పాటించాలి.
-గాలం రవి, రైతు , రావికంపాడు, చండ్రుగొండ