ఖమ్మం సిటీ, జూలై 5: ‘శభాష్.. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎంతో అద్భుతంగా ఉంది. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా కనిపించింది. ఇక్కడి వైద్యులు, సిబ్బంది చక్కగా పనిచేస్తున్నారు. ఇదే ఒరవడిని కొనసాగించండి. అవార్డు లేదా రివార్డు కోసం ప్రభుత్వంతో చర్చిస్తాం’ అని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం పెద్దాసుపత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. ఆ క్రమంలో అక్కడి ఆహ్లాదకర వాతావరణం, వార్డుల్లో పరిశుభ్రత, రోగులకు అందుతున్న వైద్యసేవలను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయారు. తొలుత ఆయన దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒక్కో విభాగం వైద్యాధికారులతో మాట్లాడుతూ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాత ఆసుపత్రి, ఎంసీహెచ్ భవనంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి యంత్రాంగం పనితీరు గురించి ఆరాతీశారు. ఈ సందంర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు భిన్నంగా ఖమ్మం పెద్దాసుపత్రి ఉందన్నారు. గాంధీ, ఉస్మానియా తరహాలో రోగులు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసుకోవాలని, రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. చివరగా ఎంపీ జోగినేపల్లి సంతోశ్కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, ఏవో డాక్టర్ రాజశేఖర్గౌడ్, అన్ని విభాగాల హెచ్ఓడీలు, పరిపాలన అధికారి ఆర్వీఎస్ సాగర్, డైటీషియన్ సూర్యపోగు మేరి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, క్వాలిటీ కంట్రోల్ ఇన్చార్జి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీసీలో సమీక్ష సమావేశం..
ఖమ్మం జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ దవాఖానల పనితీరుపై మంగళవారం సాయంత్రం రాష్ట్ర కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ టీటీడీసీ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం పెద్దాసుపత్రి, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, మధిర, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం సీహెచ్సీల యంత్రాంగంతో సుదీర్ఘంగా చర్చించారు. దవాఖానల్లో సమస్యలు, రోగులు పడుతున్న ఇబ్భందుల గురించి అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను విధిగా జరిపించాలని ఆదేశించారు. ఖమ్మం పెద్దాసుపత్రిలో సాధారణ ప్రసవాలు మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. అన్ని సీహెచ్సీల్లోనూ ఆరోగ్యశ్రీ సేవల సంఖ్యను పెంచుకోవాలన్నారు. కాగా, టీఎస్వీవీపీ ఖమ్మం జిల్లాలోని ఉద్యోగుల ప్రమోషన్ల విషయమై టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ సాగర్ సారథ్యంలో డాక్టర్ అజయ్కుమార్కు వినపతిపత్రం అందజేశారు.