సత్తుపల్లి టౌన్, జూలై 5 : అనారోగ్యంతో ఆసుపత్రుల పాలై వైద్యం చేయించుకుని ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పేదలకు అందించే ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం సత్తుపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.14లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణించిన ఐదుగురు కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల విలువైన బీమా చెక్కులను అందించారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ర్టాలు అభివృద్ధి విషయంలో తెలంగాణ వైపు చూస్తున్నాయని, పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదన్నారు. ఇలాంటి కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు.
11న బండి, వద్దిరాజు అభినందన సభ
పారిశ్రామికవేత్తలు బండి పార్ధసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు అభినందనలు తెలుపుతూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈనెల 11న సత్తుపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ సభ విజయవంతానికి నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ కమిటీలను ఆహ్వానించనున్నట్లు వివరించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల టీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు. 11న సత్తుపల్లిలో సాయంత్రం 3 గంటలకు జలగం వెంగళరావు డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఇరువురు రాజ్యసభ సభ్యులకు సన్మానం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, సత్తుపల్లి, వేంసూరు జడ్పీటీసీలు కూసంపూడి రామారావు, వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు అనిల్, మల్లూరి అంకమ రాజు, పెనుబల్లి మండల నాయకులు కనగాల వెంకట్రావు, లక్కినేని వినీల్, రఫి టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.