కారేపల్లి, జూలై 5: ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల సౌకర్యాలనూ అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అదనపు గదుల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి మంత్రి అజయ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. గ్రామీణ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల జోలికి పోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ‘మన ఊరు మన బడి’లో భాగంగా పూర్వవిద్యార్థులు, ఎన్ఆర్ఐలు, గ్రామస్తులు విరాళాలు అందిస్తే సర్కారు బళ్లను మరింత అభివృద్ధి చేసుకోవచ్చునని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరై ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సూచించారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని అన్నారు.
ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రారంభించడంతో సర్కారు బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అన్నారు. కేజీబీవీల్లో తొలుత ఆరు నుంచి పదోతరగతి వరకు ఉండేదని, ఇప్పుడు ఇంటర్ బోధన అందుబాటులోకి వచ్చిందని అన్నారు. పేద విద్యార్థులకు ఇది శుభపరిణామమన్నారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజానికి వెలుగునిస్తారని అన్నారు. కారేపల్లి కేజీబీవీలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. అకడమిక్ బ్లాక్కు డ్యూయల్ డెస్క్లు, లోతట్టు ప్రదేశాన్ని చదును చేసేందుకు అయ్యే వ్యయానికి ప్రతిపాదనలు సమర్పించాలని అక్కడే ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను మంత్రి ఆదేశించారు. విద్య, వైద్య రంగాలను కేంద్ర ప్రభుత్వ విస్మరించిందని విమర్శించారు.
అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ: వైరా ఎమ్మెల్యే
తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 983 గురుకులాలను ఏర్పాటు చేసిందని, కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఒక్కో అడుగూ ముందుకేస్తోందని అన్నారు. అనంతరం పాఠశాల ప్రత్యేకాధికారి జీ.ఝాన్సీసౌజన్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి పాఠశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, డీఈవో యాదయ్య, ఆర్డీవో రవీంద్రనాథ్, డీఆర్డీవో విద్యాలత, ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, ఆదెర్ల స్రవంతి, మాలోత్ కిశోర్, బానోత్ కుమార్, ఇమ్మడి రమాదేవి, పెద్దబోయిన ఉమాశంకర్, ఉదయశ్రీ, పుల్లారావు, శ్యామ్ప్రసాద్, ఎం.చంద్రశేఖర్, తహసీల్దార్ కోట రవికుమార్, జయరాజు తదితరులు పాల్గొన్నారు.