వైరా, జూలై 4 : తాను జన్మించిన గ్రామాభివృద్ధికైన తోడ్పాటునందిస్తూ రుణం తీర్చుకుంటున్నాడు ఓ యువకుడు. చదువుకున్న ప్రభుత్వ పాఠశాలతోపాటు గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నాడు. గ్రామంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు ఆలయ నిర్మాణానికైన ఖర్చులో అగ్రభాగం విరాళాన్ని అతడే అందించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ యువకుడు ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని నేడు ఉన్నత స్థాయికి చేరాడు. సొంత గ్రామాన్ని మరిచిపోకుండా నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. భవిష్యత్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని సంకల్పంతో విరాళాలు అందజేశారు.
ఎంతో సహృదయంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నా ఆయనే వైరా మండలంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన తాళ్లూరి సతీశ్కుమార్. రెబ్బవరం గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సతీశ్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్థిరపడ్డారు. కొన్నేళ్లుగా సెన్సెషనల్ అగ్రి ఇన్పుట్స్ ప్రైవేటు లిమిటెడ్ బయో కంపెనీని స్థాపించి వ్యాపార రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగారు. అప్పటి నుంచి తన సంపాదనలో కొంతభాగాన్ని గ్రామాభివృద్ధికి కేటాయిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.కోటితో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామానికి చెందిన నిరుపేదలకు ఆపద సమయంలో ఆర్థికసాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానంగా పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వసతులతో చదువుకోవాలనే ఉద్దేశంతో శ్రమిస్తున్నారు. అందులో భాగంగా రెబ్బవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి లక్షలాది రూపాయలను ఖర్చు చేశారు. గ్రామస్తులు ఆయన దాతృత్వాన్ని కొనియాడుతున్నారు.
గ్రామాభివృద్ధి ఇలా..
రెబ్బవరం గ్రామంలో రూ.కోటితో తాళ్లూరి సతీశ్ అభివృద్ధి పనులు చేపట్టారు. 2014 నుంచి గ్రామాభివృద్ధికి సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. 2018 సంవత్సరంలో గ్రామంలోని ఎస్సీకాలనీలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల పునరుద్ధరణకు నడుం బిగించారు. తన తండ్రి తాళ్లూరి రాఘవయ్య జ్ఞాపకార్థం రూ.15 లక్షలతో పాఠశాలకు కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో విద్యార్థులకు అవసరమైన పలు రకాల వసతులను కల్పించారు. అప్పట్లో ఈ భవనాన్ని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రారంభించారు.
అదేవిధంగా గ్రామంలో రామాలయం పునరుద్ధరణకు 2018లో రూ.35 లక్షల విరాళాన్ని అందజేశారు. అదే ఏడాది ఈ గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్తో పాటు, మూడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు రూ.2 లక్షల వ్యయంతో బ్యాగులు, నోట్పుస్తకాలు అందజేశారు. హైస్కూల్లో రూ.1.50 లక్షలతో డైనింగ్హాల్కు మరమ్మతులు చేయించారు. 2014-15 సంవత్సరాల్లో సుమారు రూ.50 వేలతో మొక్కలకు ట్రీగార్డ్స్ను ఏర్పాటు చేశారు. 2019 సంవత్సరంలో గ్రామంలోని ఓ నిరుపేద ఇంజినీరింగ్ విద్యార్థికి రూ.1.25 లక్షలు ఆర్థికసాయం చేశారు. హైస్కూల్లో విద్యావలంటీర్ల వేతనాల కోసం రూ.36 వేలను విరాళంగా అందజేశారు. 2021లో సెంటర్ ప్రైమరీస్కూల్లో మరమ్మతుల కోసం రూ.60 వేలు విరాళంగా అందజేశారు. అంతేకాకుండా గ్రామంలో నిరుపేదల కోసం విద్యార్థులకు లక్షలాది రూపాయలు అందించారు.
పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు..
గ్రామంలోని బీసీకాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయాన్ని అందిస్తానని తాళ్లూరి సతీశ్ ప్రకటించారు. గ్రామంలో బీసీకాలనీ పాఠశాలకు ఒక భవనం మాత్రమే ఉంది. ఆ భవనం విద్యార్థుల సంఖ్యకు సరిపోవడం లేదు. దీంతో ఆ భవనంపై మరో గదిని నిర్మిస్తానని ఆయన హామీఇచ్చారు. త్వరలో రూ.15 లక్షలతో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాకుండా గ్రామంలోని వైకుంఠధామానికి కావాల్సిన అదనపు సౌకర్యాలకు ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. ఒకవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు గ్రామంలోని నిరుద్యోగులకు ‘సెన్సెషనల్ అగ్రి ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
పల్లె రుణం తీర్చుకుంటా..
నాకు జన్మనిచ్చిన గ్రామమైన రెబ్బవరం రుణం తీర్చుకుంటా. ఇప్పటికే కోటి రూపాయలతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టా. ప్రథమ ప్రాధాన్యతగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశా. బీసీకాలనీలోని మరో ప్రాథమిక పాఠశాలకు భవనాన్ని నిర్మించి మరింత అభివృద్ధి చేస్తా. నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులతో విద్యను అభ్యసించాలనేదే నా ధ్యేయం. గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా నా సహాయ సహకారాలు అందిస్తా.
– తాళ్లూరి సతీశ్కుమార్