కొత్తగూడెం క్రైం, జూలై 4 : ఉద్యోగోన్నతి పొందిన ఐపీఎస్ అధికారి జి.వినీత్ జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన సునీల్ దత్ వినీత్కు బాధ్యతలను అప్పగించారు. కర్నాటక రాష్ర్టానికి చెందిన వినీత్ మొదట వైద్య వృత్తిలో కొనసాగుతూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి 2017లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఖమ్మంలో ప్రొబేషనరీ కాలపరిమితి ముగిశాక వినీత్ జి భద్రాచలం ఏఎస్పీగా 2020 నవంబర్ 9వ తేదీన తొలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉద్యోగోన్నతి పొంది 2021 డిసెంబర్ 1న నిజామాబాద్ అదనపు డీసీపీ(శాంతిభద్రతలు)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 4వ తేదీన నిజామాబాద్ నుంచి బదిలీపై వచ్చిన వినీత్ జి కొత్తగూడెం ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఉన్న భద్రాచలం సబ్డివిజన్ ఏఎస్పీగా పని చేసిన అనుభవం వినీత్ జికి జిల్లా ఎస్పీగా ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు. అసాంఘిక శక్తులను రూపుమాపడం, యువతను పట్టి పీడిస్తున్న గంజాయి వంటి మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.
సునీల్ దత్కు ఘనంగా వీడ్కోలు
నాలుగేళ్లపాటు జిల్లాలో అలుపెరుగని సేవలందించిన ఎస్పీ సునీల్ దత్కు జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. 2017లో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించి, అక్కడి నుంచి జగిత్యాల ఎస్పీగా బదిలీపై వెళ్లి, 2018లో జిల్లా ఎస్పీగా వచ్చిన ఐపీఎస్ అధికారి సునీల్ దత్ నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుని బదిలీ అయిన విషయం తెలిసిందే. ఉదయం ఎస్పీ సునీల్దత్ రిలీవ్ అవుతూ నూతన ఎస్పీ వినీత్కి బాధ్యతలను అప్పగించారు. అయితే ఈ నాలుగేళ్లలో ఎస్పీ సునీల్ దత్ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో ఆదరాభిమానాన్ని చురగొనడమే కాకుండా పోలీస్ అధికారులు, సిబ్బందితో మమేకమవుతూ వారితో బంధాన్ని సంపాదించుకున్నారు. దీంతో బదిలీపై వెళ్తున్న సునీల్దత్కు కొత్త ఎస్పీ వినీత్ సారథ్యంలో పోలీస్ అధికారులంతా కలిసి ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు.
జీపుని రథంగా తయారు చేసి, ఎస్పీ సునీల్దత్ను ఎక్కించి నూతన ఎస్పీ వినీత్ సహ పోలీస్ అధికారులంతా ఎస్పీ కార్యాలయం నుంచి ఆ రథాన్ని తాడుతో లాగుతూ మెయిన్ హాస్పిటల్ ఏరియా కూడలి వరకు ఊరేగించారు. ఈ ఊరేగింపులో భారీ సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొనడం చూసి సునీల్ దత్ భావోద్వేగానికి గురయ్యారు. ఊరేగింపు ముగిశాక అక్కడి నుంచి సునీల్ దత్ హైదరాబాద్లో రిపోర్ట్ చేసేందుకు బయలుదేరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) కే.ఆర్.కే ప్రసాద్, ఏఆర్ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు, ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి, జిల్లాలోని అన్ని సబ్డివిజన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.