నగరంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అజయ్, పువ్వాడ నాగేశ్వరరావు
ఖమ్మం, జూలై 4 : తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చూపిన సాహసం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కొమరయ్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ పోరాట చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చూపిన ధీరత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన కొమరయ్య విగ్రహాన్ని సోమవారం సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం ఆనాడు జరిగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య అమరత్వం పొంది 76 ఏళ్లు అవుతుందని, నాడు విన్నూరు రామచంద్రరెడ్డి పెత్తందారితనానికి వ్యతిరేకంగా కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో వేలాది మందితో దండు కట్టి పోరాటం చేసిన వీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు.
కొందరి చేతిలో కేంద్రీకృతమై ఉన్న భూమిని వారి నుంచి విముక్తి చేసి పేదలకు పంచిన చరిత్ర ఆ ఉద్యమానికి ఉందన్నారు. ప్రపంచ పోరాట చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కొమరయ్యను కాల్చి చంపారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఆ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించి రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ వైతాళికుల ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ట్యాంక్బండ్పై వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తులను ఆదుకొని వారి అభ్యున్నతికి పెద్దపీట వేశారని, ప్రత్యేక నిధులు ఇస్తూ వారి వృత్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కులమతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్నిరంగాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.
ప్రజల్లో నుంచి జన్మించిన కొమరయ్య;సీపీఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు
తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి అమరుడైన తొలి ఉద్యమకారుడు దొడ్డి కొమరయ్య అని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. తూటాలకు ఎదురొడ్డి పోరాడిన ఘనుడు, లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన వీరుడు కొమరయ్య అన్నారు. సామాజిక స్పృహతో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలగడం అదృష్టంగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, ఎస్బీఐటీ విద్యాసంస్థల అధినేత ఆర్జేసీ కృష్ణ, టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కూరాకుల వలరాజు, కమర్తపు మురళి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు మేకల మల్లిబాబుయాదవ్, మేకల సుగుణారావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, సీపీఐ నాయకులు భాగం హేమంతరావు, పోటు ప్రసాద్, నాయకులు అల్లిక వెంకటేశ్వర్లు, చిన్నం మల్లేశం, రాజేశ్, వెంకటనారాయణ, గోపాల్, ఉపేందర్, సింహాద్రి యాదవ్, పొదిల చిన్న పాపారావు, పులిపాటి ప్రసాద్, మాటేటి కిరణ్, లింగయ్య పాల్గొన్నారు.