కూసుమంచి, జూన్ 2:కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో విద్యాకుసుమాలు వికసిస్తున్నాయి. తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. డ్రాపౌట్స్ను తగ్గించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కస్తూర్బాలను ఏర్పాటు చేసింది. ఈ విద్యాలయాలు చదువుకు దూరమైన బాలికల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నాయి. అసలు చదువే వద్దనుకున్న వారి ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులు పని చేస్తూ ఉత్తమ విద్యార్థినులుగా తయారు చేస్తున్నారు. తరగతులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో కస్తూర్బా విద్యాలయాల విద్యార్థులు సత్తా చాటారు. కార్పొరేట్కు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 583 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా.. 523 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 775 మందికి 573 మంది, ద్వితీయ సంవత్సరంలో 608 మందికి 478 మంది ఉత్తీర్ణత సాధించారు.
కస్తూర్బా బాలికా విద్యాలయాల (కేజీబీవీ) లక్ష్యం ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపడం. డ్రాపౌట్స్ను తగ్గించి నిత్య విద్యార్థులుగా మార్చడం. తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పడం. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు పని చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అసలు చదువులే వద్దనుకున్న వారి ఆలోచనలు మార్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. గురుకులాలకు దీటుగా విద్యాలయాల్లో వసతులు కల్పిస్తున్నారు. విద్యార్థులను కేవలం తరగతులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన పదోతరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా ఉన్న కస్తూర్బా విద్యాలయాల విద్యార్థులు సత్తా చాటారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ గౌతమ్, డీఈవో యాదయ్య, జీసీడీవో ఉదయశ్రీ అభినందించారు.
17 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005లో కస్తూర్బా విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో వాటి సంఖ్య 14కు చేరింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో 2017లో కస్తూర్బా విద్యాలయాలు అప్గ్రేడ్ అయ్యాయి. అవసరాన్ని బట్టి విద్యాలయాల్లో కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని వేల మంది బడుగు, బలహీన వర్గాలకుచెందిన విద్యార్థులు ఇక్కడ చదువుకుని విద్యావంతులయ్యారు. ఒకప్పుడు ‘కస్తూర్బా’ల్లో విద్యార్థులను చేర్పించడం కష్టతరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో విద్యాలయంలో కాంపిటీషన్ 1:5కి పెరిగిందంటే డిమాండ్ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్లో హవా..
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం రూరల్ పరిధిలోని కస్తూర్బా విద్యాలయంలో ఎంపీసీ చదువుతున్న ధరణి, ప్రస్తుతి 470 మార్కులకు 464 చొప్పున సాధించి సత్తా చాటారు. చింతకాని విద్యాలయానికి చెందిన శ్రీనిత్య 470 మార్కులకు 461 సాధించారు. ఖమ్మం రూరల్, రఘునాథపాలెం విద్యాలయాలకు చెందిన భద్రకాళి, శ్రీవిజయ బైపీసీ విభాగంలో 440 మార్కులకు 427, ఖమ్మం అర్బన్ విద్యాలయానికి చెందిన దేవిక సీఈసీ విభాగంలో 500 మార్కులకు 467 , ఏన్కూరు విద్యాలయానికి చెందిన రాజేశ్వరి, సమీరా ఎంపీహెచ్డబ్ల్యూ విభాగంలో 500 మార్కులకు 485 సాధించారు.
ఫలితాల్లో మెరికలు వీరే..
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఖమ్మం రూరల్ కస్తూర్బా విద్యాలయానికి చెందిన ఎంపీసీ విద్యార్థిని లావణ్య 932 మార్కులు, చింతకాని విద్యాలయానికి చెందిన గౌతమి 962 మార్కులు, ఏన్కూరు విద్యాలయానికి చెందిన సీఈసీ విద్యార్థిని స్వాతి 985 మార్కులు, ఎంపీహెచ్డబ్ల్యూలో విద్యార్థిని నందిని 931 మార్కులు సాధించి సత్తా చాటారు.
ఇంటర్ ఫలితాల్లో నాలుగు విద్యాలయాలు టాప్..
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షా ఫలితాల్లో వందకు వంద శాతం ఫలితాలు సాధించిన విద్యాలయాలు నాలుగు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ విభాగంలో కారేపల్లి విద్యాలయం, ఎంపీహెచ్డబ్ల్యూ, సీఈసీ గ్రూపుల్లో బోనకల్లు కస్తూర్బా, ఇంటర్మీడియట్ సెకండియర్ ఎంపీహెచ్డబ్ల్యూ విభాగంలో కూసుమంచి కస్తూర్బా, ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీహెచ్డబ్ల్యూలో కామేపల్లి కస్తూర్బా విద్యాలయాలు 100 శాతం ఫలితాలు సాధించాయి.
పది ఫలితాల్లో ‘ఏన్కూరు’ టాప్..
పది పరీక్షా ఫలితాల్లో ఏన్కూరు కస్తూర్బా విద్యాలయం 100 శాతం ఫలితాలు సాధించింది. ఇక్కడి నుంచి 44 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణు లయ్యారు. అనూష, లక్ష్మీచైతన్య 9.8 జీపీఏ సాధించారు.
జిల్లాస్థాయిలో ఫలితాలు ఇలా..
కస్తూర్బాల్లో పోటీ పెరిగింది..
కస్తూర్బా విద్యాలయాల్లో డ్రాపౌట్స్కు ప్రాధాన్యం ఇస్తాం. విద్యాలయాల్లో చే రిన వారు మొదట్లో ఇబ్బం ది పడతారు. తర్వాత ఇక్క డి వాతావరణానికి అలవా టు పడతారు. ఏన్కూరు కస్తూర్బా నుంచి ఈసారి టెన్త్ ఫలితాలను 100శాతం సాధించాం. దీంతో ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అమాంతం పెరిగింది.
– ఉష, ఎస్వో, ఏన్కూరు
డ్రాపౌట్స్తో ఉత్తమ ఫలితాలు..
కస్బూర్బా విద్యాలయాలు డ్రాపౌట్స్ కోసం ఏర్పాటయ్యాయి. బడి మధ్యలో వదిలేసిన పిల్లలతో మేం ఉత్తమ ఫలితాలు సాధిస్తు న్నాం. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తున్నాం. రూరల్ పరిధిలోని కస్బూరా విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఏన్కూరు కస్బూర్బా విద్యాలయం టెన్త్లో వంద శాతం ఫలితాలు సాధించింది.
– ఉదయశ్రీ, జీసీడీవో