ఖమ్మం వ్యవసాయం, జూలై 2:అంగన్వాడీ టీచర్ అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఔరా అనాల్సిందే. విద్య, వైద్య సేవలను జోడెడ్లుగా మార్చుకొని తన పరిధిలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆమె అందిస్తున్న సేవలు మరువలేనివి. సీజన్ వ్యాధుల నివారణ, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందించే బాధ్యత, చివరికి భారత రాజ్యాంగం ప్రవేశపెట్టిన ఎన్నికల విధుల్లో సైతం ఆమె సేవలు కీలకం. ఇందుగలదు అందులేదు అనే సందేహం లేకుండా అన్నిరంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్ల సేవలను ప్రతిఒక్కరూ ప్రశంసించాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో కనీస గుర్తింపు ఇవ్వాలని వారు చేసిన పోరాటాలు అన్నీఇన్నీ కావు, కానీ ఏ ఒక్క పాలకూడు వారి మొర ఆలకించిన పాపానపోలేదు. పైగా ఉద్యమాలు చేసిన నాటి అంగన్వాడీ కార్యకర్తలను అణిచివేసేందుకు అనేక విధాలుగా ఇబ్బందిపెట్టిన సంగతి తెలిసిందే. ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత స్త్రీ, శిశు సంక్షేమశాఖలో అనేక మార్పులు, చేర్పులు చేయడంతోపాటు, సిబ్బంది జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చారు.
వంటింటి నుంచి ఓటింగ్ వరకు..
పొద్దుపొద్దుగాల వంటింట్లో మొదలయ్యే అంగన్వాడీల సేవలు, పొద్దుగూకాల ఇంటింటి సర్వే వరకు పండగ, పబ్బం అనే విరామం లేకుండా కొనసాగుతూనే ఉంటాయి. కేవలం స్త్రీ, శిశు సంక్షేమశాఖలకే ఆమె సేవలు పరిమితం కాలేదు. కేంద్రాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూనే ప్రజాస్వామ్యంలో ప్రధాన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియలో ఆమెదే కీలకపాత్ర అని చెప్పవచ్చు. మాతా, శిశు సంరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ అందించేందుకు వారి సేవలు అమోఘం. కేంద్రాల్లోనే స్వయంగా వైద్యారోగ్య పరీక్షలు చేయించడంతోపాటు, తల్లి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు అంగన్వాడీ టీచర్ ఆ తొమ్మిది నెలలు కీలకపాత్ర పోషిస్తున్నది. పల్స్పోలియో, సంపూర్ణ అక్షరాస్యత, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియలో అంగన్వాడీ టీచర్ పాత్ర అంతాఇంతా కాదు. కేంద్రంలో సేవలు అందిస్తూనే ప్రతి రోజూ కేంద్రం ఆవాస ప్రాంతంలోని ఇంటింటి సర్వే చేస్తూ ముందస్తు ఆరోగ్య చర్యలు చేపడుతున్న వారి సేవలు అభినందనీయం.
విద్యా, వైద్యం జోడెడ్లుగా….
సాధారణంగా అంగన్వాడీ టీచర్ అంటే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పిండి, పెద్దలకు అన్నం పెట్టి పంపిస్తారనే భావన ఉంటుంది. అది కొసరు మాత్రమే. అసలు పని వేరే ఉంటుంది.. అది తెలియాలంటే స్వయంగా కేంద్రాలకు వెళ్లి చూడాల్సిందే.. నేడు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కాన్వెంట్లు మాయం అయ్యాయంటే అందుకు ప్రధాన కారణం అంగన్వాడీలే. కేంద్రాల్లో 3-6 సంవత్సరాల పిల్లలకు అవసరమైన దానికంటే ఎక్కువగానే ఆంగ్లబోధన చేస్తుండడంతో చిన్నారుల హాజరుశాతం ఏటేటా పెరుగుతున్నది. లక్షలు లక్షలు ఫీజులు కట్టినా ప్రైవేట్ పాఠశాలల్లో సంపూర్ణారోగ్యం కనుచూపు మేర కనపడదు. అంగన్వాడీ టీచర్ తీసుకుంటున్న అదనపు బాధ్యతతో కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణి, బాలింతలకు పక్షంరోజులకోసారి ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయి. స్వయంగా వైద్యారోగ్యశాఖ అధికారులు కేంద్రాలకు వచ్చి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు. బడీడుకు వచ్చే పిల్లలను బలిష్టం చేసి, పై తరగతులకు పంపుతున్న అంగన్వాడీ టీచర్లు అటు విద్య, ఇటు ఆరోగ్యంపై చేస్తున్న సేవలకు సబ్బండవర్గాల ప్రజలు ఫిదా అవుతున్నారు.
స్వరాష్ట్ర సాధనతో సమస్యలకు చెక్
స్వరాష్ట సాధన తరువాత సీఎం కేసీఆర్ చొరవతో అంగన్వాడీ కేంద్రాలకు కొత్త వెలుగులు రావడంతోపాటు సిబ్బంది ఇబ్బందులకు చెక్ పడింది. సమాజంలో అంగన్వాడీ టీచర్కు మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కార్యకర్త పేరు తొలగించి టీచర్గా మార్పు చేశారు. అదేవిధంగా నెలకు టీచర్కు రూ.4,500 గౌరవ వేతనం ఉండగా, రూ.4,500 నుంచి రూ.6,500 అనంతరం రూ.10.500కు పెంచారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ద్వారా వేతనం పెంచిన విధంగానే అంగన్వాడీ టీచర్లకు సైతం మరో రూ.3 వేలు పెంచారు. దీంతో ప్రస్తుతం నెలకు రూ.13,500 చొప్పున వేతనం పొందుతున్నారు. రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా నేడు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకవిలువలతో కూడిన మధ్యాహ్న భోజన సదుపాయం అందుబాటులోకి రావడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
చిన్న ఉద్యోగం.. పెద్ద బాధ్యత
అంగన్వాడీ టీచర్ ఉద్యోగం చాలా చిన్నది కావచ్చు కానీ వారు నిర్వహించే బాధ్యత చాలా గొప్పది. సంక్షోభ సమయంలో టీచర్లు అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువలేరు. గత రెండేండ్లగా కరోనా విపత్తులో పిల్లల నుంచి పెద్దల వరకు అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. కరోనా విలయతాండవం చేసిన సమయంలో సైతం మేమున్నాం అనే భరోసా కల్పించిన టీచర్లు సబ్బండవర్గాల మన్ననలు పొందారు. కంటోన్మెంట్ జోన్లలో లబ్ధిదారులు, గర్భిణులు, బాలింతలకు పోషకపదార్థాలు అందించారు. పీపీ కిట్లను ధరించి వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి అవసరమైన సేవలు అందించి అధికారుల మన్ననలు చూరగొన్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన టీచర్లు స్వయంగా మాస్కులు తయారు చేసి అందించారు. తమవంతు సహాయంగా భోజనాలను సైతం తయారు చేసి కొవిడ్ బాధితులకు అందించి వారి అభిమానం పొందారు.
ఎంతో సంతోషంగా ఉంది
దేవుడితో సమానమైన బాలలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. 20ఏళ్ల నుంచి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవ చేస్తున్నాను. ఒకవైపు అంగన్వాడీ కేంద్రంలో విద్య, వైద్య సేవలు అందిస్తూనే, ఇతరశాఖల కార్యక్రమాలు చేస్తున్నా. మా అంగన్వాడీ కేంద్రంలో చదివిన ఎందరో చిన్నారులు నేడు ఉన్నత విద్యలో ఉన్నారు. భవిష్యత్కు మంచి పునాది పడాలంటే చిన్న వయస్సులో నాణ్యమైన విద్యను అందించాలి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పిల్లలకు ఆంగ్లబోధన అందుబాటులో ఉంది.
– పసుపులేటి విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్, నాయుడుపేట, ఖమ్మంరూరల్
సమాజాభివృద్ధిలో అంగన్వాడీలది కీలకపాత్ర
సమాజ అభివృద్ధిలో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకం. అనేక అవగాహన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం వారు పనిచేస్తున్నారు. మాతా, శిశు సంరక్షణకు అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యల ఫలితంగా నేడు గర్భిణులు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం కేంద్రాలు ఎంతో బలోపేతమయ్యాయి. కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు, చిన్నారుల సంఖ్య మరింత పెరిగింది. తద్వారా కాన్వెంట్లు కనుమరుగయ్యాయి.
– సీహెచ్ సంధ్యారాణి, డీడబ్ల్యూవో, ఖ్మమం