ఖమ్మం వ్యవసాయం, జూలై 2: తెలంగాణ పత్తి పంటకు రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ పలుకుతున్నది. తక్కువ పెట్టుబడి, మార్కెట్లో మద్దతు ధర లభిస్తుండడంతో రైతులు పత్తి సాగుకు సై అంటున్నారు. అంతేకాకుండా, పంట ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం పుష్కలంగా ఉంది. జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో మొత్తం ఏడు వ్యవసాయ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. 17 జిన్నింగ్ మిల్లుల దగ్గర ఏటా భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. పంట చేతికి వచ్చే సమాయానికి ప్రైవేట్, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశంగా రైతులు భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నల్ల, ఎర్ర నేలలు ఉండడం, భౌగోళిక వాతావరణం అనుకూలంగా ఉండడంతో పత్తి సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు1,10,647 ఎకరాలకు చేరింది.
కొన్నేళ్లుగా జిల్లా రైతులు పత్తినే ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. రెండో ప్రధాన పంటగా వరిని పండిస్తున్నారు. సాగుకు విత్తనాలు విత్తుకోవడానికి సమయం ఉండడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరగనుంది. పత్తిసాగుకు అనుకూలంగా జిల్లా వ్యాప్తంగా నల్ల, ఎర్ర నేలలు ఉండడం, భౌగోళిక వాతావరణం సైతం అనుకూలం కావడంతో దశాబ్దాలుగా రైతులందరూ పత్తి సాగు పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ పెట్టుబడి, మార్కెట్లో నిలకడగా మద్దతు ధర లభిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతుల నుంచి మొదలుకొని పెద్ద రైతుల వరకూ పత్తి సాగుపై మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు పంట చేతికి వచ్చే సమాయానికి అనువైన విధంగా ప్రైవేట్, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండడం కలిసివచ్చే అంశంగా రైతులు భావిస్తున్నారు. ఏటా సర్కారు పత్తి రైతుల పరిస్థితిని గమనించి ఆయా మార్కెట్లలో ప్రైవేట్ వ్యాపారులకు కొనుగోలు అవకాశం కల్పిస్తూనే సీసీఐ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.11 వేల నుంచి రూ.12 వేల వరకూ పలుకుతుండడం విశేషం.
మార్కెటింగ్ సౌకర్యం పుష్కలం
పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు జిల్లాలో పుష్కలంగా అవకాశం ఉంది. దీంతో సకాలంలో పంటను విక్రయించుకునేందుకు రైతులకు వెసులుబాటు కలుగుతోంది. జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో మొత్తం ఏడు వ్యవసాయ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లలో పత్తి వ్యాపారులు పంటను కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పదిహేడు జిన్నింగ్ మిల్లుల దగ్గర ఏటా భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. పత్తి రైతుల సౌకర్యార్థం రెండేళ్ల నుంచి మంత్రి అజయ్కుమార్ సూచనలతో తేమశాతం నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండడంతో మరింత ప్రయోజనం కలుగుతోంది.
సాగుకు అనుకూలమైన నేలలు
జిల్లా భౌగోళిక పరిస్థితులు, అనుకూలమైన నేలలు ఉండడంతో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం దాదాపుగా 16 మండలాల్లో ఉన్నప్పటికీ 50 శాతానికి పైగా చెలక నేలలే ఉన్నాయి. ఈ భూముల్లో పత్తి సాగు ఎక్కువ మొత్తంలో జరుగుతోంది. ఆ తరువాత స్థానంలో అపరాలు, చిరుధాన్యాలు సాగవుతున్నాయి.
మండలాల వారీగా..
ప్రస్తుతం జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు 1,10,647 ఎకరాలకు చేరడం విశేషం. మండలాలవారీగా పరిశీలిస్తే కామేపల్లి మండలంలో 1,597 ఎకరాలు, ఖమ్మం అర్బన్లో 818, రఘునాథపాలెంలో 6,560 ఎకరాలు, ఖమ్మం రూరల్లో 6,347, కూసుమంచిలో 2,387, నేలకొండపల్లిలో 1,024, తిరుమలాయపాలెంలో 15,801, బోనకల్లులో 10,292, చింతకానిలో 15,994, ముదిగొండలో 8,438, ఎర్రుపాలెంలో 2,524, కల్లూరులో 922, పెనుబల్లిలో 223, సత్తుపల్లిలో 10, తల్లాడలో 3,266, వేంసూరులో 557 ఎకరాలు, ఏన్కూరులో 8,055, కొణిజర్లలో 10,152, సింగరేణిలో 10,400, వైరా మండలంలో మరో 1,877 ఎకరాల చొప్పున రైతులు సాగు చేస్తున్నారు.
ఆల్టైం రికార్డు దిశగా పత్తి ధర..
పత్తి పంట చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మార్కెట్లో ధర పలుకుతోంది. ప్రైవేట్ మార్కెట్లో కంటే అదనంగా ధర రావాలనే ఉద్దేశంతో సీసీఐ మద్దతు ధర ప్రకటించి గత కొన్నేళ్లుగా పత్తి పంటను కొనుగోలు చేస్తోంది. అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే అధిక ధర చెల్లించి పంటను కొనుగోలు చేయడం విశేషం. గత సంవత్సరం సీసీఐ పంటకు గరిష్ఠ మద్దతు ధర క్వింటా రూ.6 వేలు నిర్ణయించి కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుతం సీసీఐ కంటే రెండు రెట్లు అదనంగా క్వింటా రూ.11 వేల నుంచి రూ.12 వేల చొప్పున పంటను ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయడం విశేషం. దీంతో వచ్చే నూతన పంటకు సైతం ఈ సంవత్సరం ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే అదనంగా ధర ప్రకటించి పంటను కొనుగోలు చేసే అవకాశం కన్పిస్తోంది.