మధిర టౌన్, జూలై 2: హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతున్న ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్రమంతటా వ్యతిరేక సెగలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోనే కాకుండా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలోనూ ‘బైబై మోదీ’ అనే నినాదంతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. వీటిని మధిర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ‘తెలంగాణపై బీజేపీ పార్టీది అదే కక్ష. ఎనిమిదేళ్లు గడిచినా అదే వివక్ష. ప్రతిసారీ వచ్చుడు.. స్పీచ్లు దంచుడు.. తెలంగాణపై విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు..’ అని ఉంది. ‘ఖాజీపేట రైల్వేకోచ్, బయ్యారానికి ఉక్కు కర్మాగారం ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించిన మోదీ వెళ్లిపోవాలి’ అంటూ మరో ఫ్లెక్సీపై రాసి ఉంది. మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, ఫ్లై ఓవర్ బ్రిడ్జీ సమీపాన ఉన్న హోర్డింగ్ల్లో ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.