ఖమ్మం, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం మొదలైంది.. పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.. ఇప్పటికే వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ పారంభించింది.. రెండు మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది.. మరో వైపు సర్కార్ ఇతర రుణాలతోపాటు పంట రుణాల పంపిణీపైనా దృష్టి సారించింది.. ఈ ఏడాది ఖమ్మం జిల్లావ్యాప్తంగా అన్నివిధాలా రూ.5,880 కోట్ల రుణ సాయం అందించాలని నిర్ణయించగా వీటిలో రూ.2,887 కోట్లు వ్యవసాయ రుణాలకే కేటాయించడం విశేషం. రుణాలు ఇచ్చే ప్రభుత్వ, సహకార, గ్రామీణ, ప్రైవేట్ రంగ బ్యాంకు యాజమాన్యాలు ఇప్పటికే లోన్ల పంపిణీపై కసరత్తు ప్రారంభించాయి..
వానకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. పంట రుణాలు అందించేందుకు జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ సీజన్లో జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతోపాటు సహకార, గ్రామీణ బ్యాంకులు రైతులకు పంట రుణాలు అందజేయనున్నాయి. ఇప్పటికే ఆయా బ్యాంకులు రైతులకు రుణాలు అందించే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ఏడాది రుణ ప్రణాళిక ద్వారా రూ.5,880 కోట్లు అందించాలని సర్కారు ఆయా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది.
నిరుడు రూ.2,459 కోట్ల పంట రుణాల లక్ష్యానికిగాను అదనంగా టార్గెట్కు మించి మరో రూ.450 కోట్లను అందజేశారు. ఎరువులు, పురుగుమందులు సహా సాగు ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది మరో రూ.3 వేల కోట్లను అదనంగా రైతులకు రుణాల రూపంలో బ్యాంకులు అందజేయనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పంటల పెట్టుబడి సొమ్మును అందజేస్తున్నది. రుణ ప్రణాళిక సైతం సిద్ధం కావడంతో సాగు సాఫీగా జరగనున్నది. పంట రుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోపు తిరిగి చెల్లించినట్లయితే వారికి వడ్డీ రాయితీ రానున్నది. రైతులు సకాలంలో పంట రుణాలు చెల్లించాలని, తద్వారా మరుసటి ఏడాదిలో మరికొంత రుణం పెంచేందుకు అవకాశం ఉంటుందని బ్యాంకుల అధికారులు పేర్కొంటున్నారు.
బ్యాంకుల వారీగా రుణ లక్ష్యం ఇదీ..
జిల్లాలో ఉన్న 14 బ్యాంకుల నుంచి వానకాలంలో రూ.5,880 కోట్లు సాగు రుణాలుగా అందజేసేలా ప్రణాళిక ఖరారైంది. బ్యాంకుల వారీగా పరిశీలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.153.77 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.64.74 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.41.63 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.230.09 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.113.92 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.115.09 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.238.79 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.126.06 కోట్లు, యూకో బ్యాంక్ రూ.31.71 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఇండియా రూ.854.67 కోట్లు కలిపి మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.3,249 కోట్లు, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్ రూ.213.83 కోట్లు, సిటీ యూనియన్ బ్యాంక్ రూ.18.61 కోట్లు, డీసీబీ బ్యాంక్ రూ.13.33 కోట్లు, ధనలక్ష్మి బ్యాంక్ రూ.35.33 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.351.21 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.199.32 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్ రూ.68.67 కోట్లు, కర్నాటక బ్యాంక్ రూ.20.67 కోట్లు, కరూర్ వైశ్యా బ్యాంక్ రూ.15.53 కోట్లు, కొటక్ మహేంద్ర బ్యాంక్ రూ.142.82 కోట్లు, డీబీఎస్ బ్యాంక్ రూ.11.96 కోట్లు కలిపి మొత్తం రూ.1,091 కోట్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ల ద్వారా రూ.968.35 కోట్లు, ఏపీజీవీబీ ద్వారా రూ.571.81 కోట్లను రైతులకు పంట, ఇతర రుణాలుగా అందజేయనున్నాయి.
కేటగిరీల వారీగా కేటాయింపులు ఇలా..
రుణ ప్రణాళికలో ఆయా కేటగిరీలకు సంబంధించి రుణాలు అందజేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం 3,17,180 మందికి రూ.5,880 కోట్ల రుణాలు అందజేయనున్నారు. కేవలం పంట రుణాలే కాకుండా అన్ని రకాల రుణాలను పరిశీలిస్తే 2.57 లక్షల మందికి రూ.2,887 కోట్లు పంట రుణాలు, రూ.447 కోట్లు వ్యవసాయ టర్మ్ లోన్లు, మరో రూ.230 కోట్లు ఇతర రుణాలు, ఇతర పంట రుణాలు, వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.163 కోట్లు, దీర్ఘకాలిక పంట రుణాలు రూ.779 కోట్లు, మైక్రో ఎంటర్ ప్రైజెస్కు రూ.219 కోట్లు, చిన్నతరహా పరిశ్రమలకు రూ.183 కోట్లు, మధ్య తరహా పరిశ్రమలకు రూ.116 కోట్లు, విద్యా రుణాలకు రూ.190.89 కోట్లు, ఇళ్ల రుణాలకు రూ.445 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.28 కోట్లు, సోలార్ పవర్ యునిట్లకు రూ.17 కోట్ల చొప్పున ఈ సంవత్సరం బ్యాంకులు రుణాలు అందజేసేలా జిల్లా రుణ ప్రణాళికను బ్యాంకర్ల కమిటీ ఖరారు చేసింది.