బోనకల్లు, జూలై 1 : నాడు ప్రయాణికులతో కళకళలాడిన బోనకల్లు రైల్వేస్టేషన్ నేడు వెలవెలబోతున్నది. కరోనా నేపథ్యంలో 2020 నుంచి రైల్వేశాఖ రైళ్లను రద్దు చేసింది. మరలా ఈ రైళ్లను పునరుద్ధరణ చేసినప్పటికీ పాసింజర్ రైళ్లు లేకపోవడంతో బోనకల్లు రైల్వేస్టేషన్ బోసిపోతున్నది. ఈ రైల్వేస్టేషన్ తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో ప్రధానమైన రైల్వేస్టేషన్గా ఉండడంతో ఈ ప్రాంతాల నుంచి రోజూ అధికసంఖ్యలో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. రైల్వేశాఖ వారు ఈ స్టేషన్ నుంచి గుంటూరు నుంచి సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్, విజయవాడ నుంచి భద్రాచలం రోడ్డు ప్యాసింజర్, విజయవాడ నుంచి డోర్నకల్ ప్యాసింజర్, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి గుంటూరు, డోర్నకల్ నుంచి విజయవాడ, భద్రాచలం రోడ్డు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి ఖాజీపేట, ఖాజీపేట నుంచి విజయవాడ రైళ్లను నడిపించారు.
ఈ రైళ్ల రాకపోకలతో స్టేషన్ నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండేది. కానీ నేడు కేవలం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను కంటి తుడుపుగా ఒక ప్యాసింజర్ రైలును నడిపిస్తున్నారు. మరో రెండు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నడిపిస్తున్న ఆ ఒక్క ప్యాసింజర్ రైలును కూడా ఎక్స్ప్రెస్ రైలుగా పరిగణించడం వల్ల చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. గతంలో కోలాహలంగా ఉన్న రైల్వేస్టేషన్ ఇప్పుడు కనీసం ప్రయాణికులు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, అదేవిధంగా శాతవాహన ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్, షిర్డీ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ రైల్వేస్టేషన్లో నిలుపుదల చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.