వైరా, జూలై 1 : హఠాత్తుగా తండ్రి మృతిచెందాడు. కుటుంబాన్ని సంరక్షించాల్సిన అతడి మరణంతో తల్లి, కుటుంబ సభ్యుల్లో అరణ్యరోదన మిగిలింది. ఒకవైపు భర్త మృతి, మరో వైపు పిల్లల సంరక్షణ గురించి ఆ తల్లి నిర్వేదం చెందింది. అయినా మనోధైర్యాన్ని కూడగట్టుకుంది. తాను నేర్చుకున్న పనిని పిల్లల జీవనం కోసం, విద్య కోసం వృత్తిగా ఎంచుకుంది. అదేవిధంగా తమకున్న రెండెకరాల పొలంతోపాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయాన్ని ప్రవృత్తిగా చేసుకుంది. సుమారు 25 ఏళ్ల పాటు పిల్లల చదువు, కుటుంబ పోషణ కోసం ఆ తల్లి నిరంతరం కష్టించింది. కుమార్తెను ఎంబీఏ, కుమారుడిని ఇంజినీరింగ్ చదివించింది. కుమార్తెకు వివాహం చేసింది. 25 ఏళ్లుగా ఆమె పడిన కష్టానికి కొడుకు రూపంలో ప్రతిఫలం లభించింది. అతడు ఒకే ఏడాదిలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించాడు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ.. అతడి కష్టాల తీరాన్ని దాటిన విజయగాథ. ఆ కొడుకే వైరా ఎస్సై శాఖమూరి వీరప్రసాద్.
వరంగల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన శాఖమూరి శ్రీనివాసరావు, ఇందిర దంపతులు. వారి కుమార్తె నాగభవ్య, కుమారుడు వీరప్రసాద్. నాగభవ్యకు ఏడాదిన్నర, వీరప్రసాద్కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు వారి తండ్రి శ్రీనివాసరావు దుర్మరణం చెందారు. దీంతో వారి పోషణ, బాధ్యతలను తల్లి ఇందిర తన భుజస్కంధాలపై వేసుకుంది. కేవలం రెండు ఎకరాల పొలంతో కుటుంబ పోషణ, పిల్లల విద్యాభ్యాసం కష్టంగా మారడంతో ఆమె అప్పటికే నేర్చుకున్న టైలరింగ్ పనిని వృత్తిగా ఎంచుకుంది. అంతేకాకుండా తనకున్న పొలంతోపాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు వేసింది. ఇలా 25 ఏళ్ల పాటు కష్టపడుతూనే ఉంది. కుమార్తె నాగభవ్య ఎంబీఏ పూర్తిచేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమారుడు వీరప్రసాద్ చిన్ననాటి నుంచే మంచిగా చదువుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చేవాడు.
చిన్ననాటి నుంచే చదువులో మేటి..
తన చిన్నతనం నుంచే తల్లి కష్టాన్ని గమనిస్తుండేవాడు వీరప్రసాద్. దీంతో అతడు కూడా చిన్ననాటి నుంచే చదువులో రాణిస్తుండేవాడు. 1 నుంచి 10 తరగతి వరకు ఖానాపూర్లోని నేతాజీ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదివారు. టెన్త్లో 441 మార్కులు (73 శాతం) సాధించాడు. ఇంటర్మీడియట్ ఎంపీసీని హన్మకొండలోని ఓ ప్రైవేటు కళాశాలో చదివాడు. 929 మార్కులు సాధించాడు. అనంతరం బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 2015లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ను పూర్తిచేశాడు. ఇందులోనూ 70 శాతం మార్కులు సాధించాడు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో ముందుకు సాగారు. వ్యవసాయ పనుల్లోనూ తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు.
ఒకే ఏడాదిలో ఏడు కొలువులకు ఎంపిక..
వీరప్రసాద్ ఒకే ఏడాదిలో ఏడు కొలువులకు ఎంపికయ్యారు. 2019లో ఆయన మొత్తం ఏడు పోటీ పరీక్షలు రాశారు. అన్నింట్లోనూ ఉద్యోగం సాధించారు. 2019లో వీఆర్వో పరీక్ష రాసి తెలంగాణ రాష్ట్రస్థాయిలో జనరల్ కేటగిరీలో 69వ ర్యాంకు సాధించారు. అదే ఏడాది పంచాయతీ కార్యదర్శి పోస్టుకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. గ్రూప్-4లో జనరల్ కేటగిరీలో రాష్ట్రస్థాయి 92వ ర్యాంకు సాధించాడు. ఆర్పీఎఫ్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా, ఎస్సైగా ఉద్యోగం సాధించారు. అదే ఏడాది పోలీస్ కానిస్టేబుల్గా, ఎస్సైగా ఉద్యోగాలు సాధించారు. అయితే పోలీస్ ఉద్యోగంపై తనకున్న ఆసక్తితో 2019లో ఎస్సైగా ట్రైనింగ్లో చేరారు. అనంతరం కారేపల్లిలో ట్రైనీ ఎస్సైగా పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. 2021 నవంబర్ 10న వైరా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.
పోలీసు ఉద్యోగమంటే మక్కువ..
పోలీసు ఉద్యోగమంటే మక్కువ ఎక్కువ. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు సమాజ అభివృద్ధిలో భాగం కావడం కోసమే పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగంలో చేరా. 2019లో మొత్తం ఏడు ఉద్యోగాలకు ఎంపికయ్యా. పోలీసు వ్యవస్థలో సమర్థవంతంగా పనిచేయాలనే సంకల్పంతోనే మిగిలిన ఉద్యోగాలకు వెళ్లకుండా ఈ ఉద్యోగంలో చేరాను. ప్రజల సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కృషిచేస్తున్నా.
–శాఖమూరి వీరప్రసాద్, వైరా ఎస్సై