ఖమ్మం, జూలై 1: ఖమ్మం నగరాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) మాస్టర్ ప్లాన్ 2వ స్టేక్ హోల్డర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఖమ్మం పట్టణం మున్సిపల్ కార్పొరేషన్గా మారి పదేళ్లవుతున్నా ఆమోదిత మాస్టర్ ప్లాన్ లేదని, పాత, కొత్త మాస్టర్ ప్లాన్లు కూడా లేవని, అందుకే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.
వీటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూలంకషంగా మదింపు చేసి రాబోయే 30 – 40 ఏళ్ల అవసరాలకు సరిపడేలా సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక చేసినట్లు తెలిపారు. నగరంలోని 80, 60 అడుగుల రోడ్లను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తామని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరమే రాష్ట్రంలో ముందుందన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్టేక్ హోల్డర్లందరూ భాగస్వామ్యం కావాలన్నారు.
అందరి సూచనల మేరకే మాస్టర్ ప్లాన్
మాస్లర్ ప్లాన్ తయారీలో అందరి సూచనలనూ పరిగణనలోకి తీసుకుంటామని సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ అన్నారు. సుడా ఏర్పాటై గత జూన్ 10కి రెండేళ్లు పూర్తయ్యాయన్నారు. 30 ఫీట్ల రోడ్లను 40 ఫీట్లుగా, 40 ఫీట్ల రోడ్లను 60 ఫీట్లుగా, 60 ఫీట్ల రోడ్లను 80 ఫీట్లుగా మార్చుతూ మాస్టర్ ప్లాన్లో చేర్చినట్లు చెప్పారు. రైల్వేస్టేషన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ చేపడతామన్నారు.
2041 వరకు..
2041 వరకు గల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. సీపీ విష్ణు మాట్లాడుతూ ప్రమాదాలు జరుగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. కార్పొరేటర్లు కమర్తపు మురళి, కురాకుల వలరాజు, టీఆర్ఎస్ నాయకులు చిరుమామిళ్ల నాగేశ్వరరావు, మందడపు మనోహర్, రామకృష్ణ, ప్రసాద్, సర్పంచ్లు, సుడా డైరెక్టర్లు, వ్యాపారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, డీటీసీపీ విద్యాసాగర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, వైరా మున్సిపల్ చైర్మన్ జయపాల్, కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.