సుజాతనగర్, జూన్ 29: వానకాలం వస్తూ సీజనల్ వ్యాధులను తీసుకొస్తుంది.. అప్రమత్తంగా లేకపోతే రోగాల బారిన పడడం ఖాయం. మనం తీసుకునే చిన్న జాగ్రత్తలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపడుతున్నది. పల్లెలు, పట్టణాల్లో ఇప్పటికే ‘పల్లె, పట్టణ ప్రగతి’ పూర్తి కాగా గ్రామాలు శుభ్రపడ్డాయి. పంచాయతీ సిబ్బంది వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని డంపింగ్యార్డుకు తరలించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించారు. మరోవైపు వైద్యసిబ్బంది ప్రజారోగ్యంపై ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ర్యాపిడ్ యాక్షన్ బృందాలు గ్రామాల్లో వ్యాధుల తీవ్రతను బట్టి పీహెచ్సీలకు సిఫార్సు చేస్తున్నారు. కరపత్రాలు పంచుతున్నారు. అరోగ్య సంరక్షణపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దోమకాటుతో ప్రబలే వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామాల్లో ఆరోగ్య కమిటీలు..
ప్రజారోగ్య సంరక్షణకు జిల్లావైద్యారోగ్యశాఖ జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో డీఎంహెచ్వో, మలేరియా అధికారి, హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డివిజన్ స్థాయిలో అదనపు డీఎంహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో, సబ్ యూనిట్ అధికారి, హెల్త్ అసిస్టెంట్, పీహెచ్సీ పరిధిలో మండల వైద్యాధికారి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఎల్టీ, ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి, హెల్త్ సూపర్వైజర్, పురపాలికల్లో శానిటేషన్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇప్పటికే ఇంటింటి సర్వే చేపట్టారు. డెంగీ లక్షణాలు ఉంటే ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. నివాసాల పరిధిలో ఫాగింగ్ చేయిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షణపై ఇప్పటికే ఐసీడీఎస్, మిషన్ భగీరథ ఈఈ, డీపీవో, డీఆర్డీవో, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఐటీడీఏ పీవో, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు, సంక్షేమశాఖ అధికారులతో కలెక్టర్ వీపీ గౌతమ్ సమీక్షలు నిర్వహించారు. పారిశుధ్య చర్యలపై అప్రమత్తం చేశారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
వానలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం ఇంటి తలుపులు, కిటికీలు మూయాలి. కిటికీలకు పరదాలు కట్టుకోవాలి. క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలి. నీళ్లుకాచి వడగట్టి తాగితే చాలా మంచిది. ఇంటి వరణలోని ఖాళీ కుండలు, కూలర్లు, టైర్లు, పాత్రల్లోని నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయాలి. లేదా పది లీటర్లలో 5 ఎంఎల్ టెమీఫాస్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇలా చేయడంతో దోమలు లార్వా దశలోనే చనిపోతాయి. కలుషిత నీరు తాగితే వాంతులు, విరేచనాలు అవుతాయి. టైఫాయిడ్తో పాటు విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కూరగాయలు, మాంసం శుభ్రంగా కడగిన తర్వాతే వండాలి. పూర్తిగా ఉడికిన తర్వాత తినాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపడుతున్నది. నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్బాల్స్ వేయిస్తున్నది. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నది. ప్రజలు ఇళ్ల మధ్య మురుగు, చెత్త నిల్వ ఉండకుండా ఉంచుకోవాలి. డెంగీతో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానలో చూపించుకోవాలి. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్ రవిబాబునాయక్,ప్రభుత్వ ఆస్పత్రి, కొత్తగూడెం