చింతకాని, జూన్ 29 :దళితవాడలు బంగారు మేడలు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఈ పథకంతో మరో సామాజిక విప్లవం రానున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. చింతకాని మండలంలోని కొదుమూరు, నాగులవంచ, రైల్వేకాలనీ తదితర గ్రామాల్లో కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తితో కలిసి 50 మందికి పైగా దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. సామాజిక అంతరాలను తొలగించాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ, అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. చింతకాని మండలంలో దళితబంధులో భాగంగా 26 గ్రామాల్లోని దళితులు సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా చింతకాని మండలంలోని సుమారు 3,700 మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు.
ప్రతి దళితవాడ బంగారు మేడ కావాలన్నదే సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని, దళితబంధు పథకంతో మరో సామాజిక విప్లవం రానున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. చింతకాని మండల పరిధిలో కొదుమూరు, నాగులవంచ, రైల్వేకాలనీ తదితర గ్రామాల్లో కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బొమ్మెర రామ్మూర్తితో కలిసి 50కు పైగా దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ సామాజిక అంతరాలను తొలగించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని, గాంధీ, అంబేద్కర్ కలలను సాకారం చేస్తున్నారని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల ఏలుబడిలో మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్లు పథకాలున్నాయని, దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చారని స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చింతకాని మండలంలో దళితబంధు అమలు ద్వారా 26గ్రామాల్లోని దళితులు సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని, దళితబంధు ఒక్క రాజకీయ పార్టీకి చెందింది కాదని, అన్ని పార్టీల్లోని నిరుపేదలకు వర్తిస్తుందని అన్నారు. దళితబంధు ద్వారా చింతకాని మండలంలో సుమారు 3,700మందికి లబ్ధి చేకూరుతున్నదని పేర్కొన్నారు. హుజూరాబాద్లో రూ.2 వేల కోట్లు, చింతకానిలో రూ.500 కోట్లు, మిగతా 3మండలాల్లో కలిపి మొత్తం సుమారు రూ.4 వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తున్నారంటే దళితుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న నిబద్ధత ఎలాంటిదో ఆలోచించాలని కోరారు.
ముమ్మాటికీ దళితుల అభ్యున్నతికే దళితబంధు పథకం సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చినట్లుగా బ్యాంకులతో సంబంధం లేకుండా దళితబంధు సాయం రూపంలో దళితుల ఆర్ధికాభివృద్ధి కోసం అందిస్తున్నారని, రూ.10 వేలతో దళితబంధు ఆర్థిక నిధిని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని 15లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అమలు కానున్నదని అన్నారు. రైతుబంధు తరహాలోనే దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా నూటికి నూరుశాతం అమలుచేసి తీరుతామని, రైతుబంధు ప్రవేశపెట్టిన వచ్చిన తొలినాళ్లలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయని, సీఎం కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా విజయం సాధిస్తుందన్నారు. రైతుబంధు ద్వారా రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతుకూ అన్ని సీజన్లకు కలిపి 57వేల 540కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమచేయడం ప్రపంచ చరిత్రలో ప్రథమమని అన్నారు.
మండల వ్యాప్తంగా 560కు పైగా డెయిరీ యూనిట్లు, 40కు పైగా జేసీబీలు, హార్వెస్టర్లు ఇప్పటికే అందజేశామని, ఒక్క నాగులవంచలోనే 250 మంది లబ్ధిదారులకు 150 మందికి ఇప్పటికే ఎంచుకున్న యూనిట్లను అందజేశామని మిగిలిన వారికి అతిత్వరలో అందిస్తామని తెలిపారు. ఇతర కులాల వారిని పెళ్లి చేసుకున్న వారికి సైతం పథకం అమలు చేయాలని అధికారులను మంత్రి పువ్వాడ ఆదేశించారు. ఇలా దిగ్విజయంగా పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం మాత్రం సాయం చేయకపోగా మోకాలడ్డుతోందని, ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రతిపక్ష పార్టీలకు ఓటు రూపంలో గుణపాఠం చెబుతారని అన్నారు. దళితులు ఇప్పుడిప్పుడే దళితబంధు పథకం ద్వారా వ్యాపారాలు కొనసాగిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, దళితబంధుపై వస్తున్న పుకార్లు అపోహలను తిప్పికొట్టాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాల్లో దళితబంధు పథకం ద్వారా మంజూరైన డెయిరీ యూనిట్లు, గొర్రెల యూనిట్లు, హార్వెస్టర్లు, జేసీబీలు, ఆటోలు, ట్రాలీలు, మినీ వ్యాన్లు, ఐజాక్ మిషన్లు, డీజే మిషన్లు లబ్ధిదారులకు అందించారు. నాగులవంచలో ఓ లబ్ధిదారుడి కోరిక మేరకు హార్వెస్టర్ను నడిపి దళితులను ఉత్సాహపరిచారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, ఆర్డీవో రవీంద్రనాథ్, సర్పంచులు ఆలస్యం నాగమణి, నక్కనబోయిన సుజాత, చాట్ల సురేశ్, కాండ్ర పిచ్చయ్య, పరిటాల యలమంద, ఎంపీపీ పూర్ణయ్య, జడ్పీటీసీ కిశోర్, ఎంపీటీసీ మునుకుంట్ల నాగరత్నం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెంట్యాల పుల్లయ్య, కిలారు మనోహర్, గురజాల హనుమంతరావు, మంకెన రమేశ్, కొండపల్లి శేఖర్రెడ్డి, నల్లమోతు శేషగిరి, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, నూతలపాటి వెంకటేశ్వర్లు, బొడ్డు వెంకట్రామారావు, వంకాయలపాటి సత్యనారాయణ, బొగ్గారపు రాంబాబు, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
దళితులకు దళితబంధు అందజేస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. మా కుటుంబంలో ముగ్గురం కలిసి జేసీబీ తీసుకొని నెల పూర్తయ్యింది. రూ.2 లక్షలు ఆదాయం వచ్చింది. వాటిల్లో రూ.90 వేలు డీజిల్ ఖర్చుకు పోగా మిగిలిన రూ.లక్షా10 వేలను ముగ్గురం సమానంగా పంచుకున్నాం. గతంలో మాకున్న ఎకరం పొలం తనఖా పెట్టుకొని అప్పు ఇవ్వమన్నా గ్రామంలో అప్పు దొరకలేదు. కానీ ఇప్పుడు ప్రతి దళిత కుటుంబానికి దేవుడిలా సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు పూర్తిగా ఇవ్వడంతో దళితులందరం సీఎం కేసీఆర్కు ఆజన్మాంతం రుణపడి ఉంటాం.
– కోపూరి నవీన్, రైల్వేకాలనీ గ్రామం