భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28 (నమస్తే తెలంగాణ) ;అన్నదాతలకు పెట్టుబడి సాయం అందింది. రైతులను రుణ బాధల నుంచి గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం కర్షకుల ఖాతాలో ‘రైతుబంధు’ సొమ్ము జమ చేస్తున్నది. తొలిరోజు ఎకరం లోపు భూమి కలిగిన రైతుల అకౌంట్లో సొమ్ము జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరం లోపు భూమి కలిగిన 1,20,249 మంది రైతులకు రూ.37.68 కోట్లు జమ చేసింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 30,459 మంది రైతుల ఖాతాల్లో రూ.10.55 కోట్ల సొమ్ము జమ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతు పక్షపాతిగా ముద్రపడిన సీఎం కేసీఆర్ నాలుగేండ్ల నుంచి ప్రతి సీజన్కు ముందుగానే రైతుబంధు పథకం ద్వారా పంటల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా వానకాలం రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం లోపు భూమి కలిగిన ప్రతి రైతు అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి. దీంతో ఆయా మండలాలకు చెందిన రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల వద్దకు వెళ్లి నగదు విత్డ్రా చేసుకున్నారు. ఈ వానకాలం సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జిల్లావ్యాప్తంగా 3,23,310 మంది రైతులకు రూ. 362.29 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. తొలిరోజు ఎకరంలోపు భూమి కలిగిన 1,20,249 మంది రైతులకు రూ.37.68 కోట్లను జమ చేశారు. ఆయా బ్యాంకుల్లో జమ అయిన సొమ్మును ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు విత్డ్రా చేసుకున్నారు. నేటి నుంచి మరో పదిరోజులపాటు రైతుబంధు సొమ్ము పంపిణీ జరగనుంది. బుధవారం 1 నుంచి 2 ఎకరాలలోపు భూమి కలిగిన రైతుల అకౌంట్లలో పంటల పెట్టుబడి సొమ్ము జమకానుంది.
మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు
వానకాలం సీజన్లో నూతనంగా మరో 13వేల మంది రైతులకు రైతుబంధు సొమ్ము అందనుంది. దీంతో జిల్లావ్యాప్తంగా అర్హత గల రైతుల సంఖ్య 3,23,310కి చేరింది. మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తే కామేపల్లి మండలంలో 11,179, ఖమ్మం అర్బన్ 3,870, రఘునాథపాలెంలో 18,434, ఖమ్మంరూరల్ 18,140, కూసుమంచి 18,504, నేలకొండపల్లి 19,038, తిరుమలయపాలెం 19,941, బోనకల్ 18,729, చింతకాని 17,091, మధిర 18,731, ముదిగొండ 18,140 మంది, ఎర్రుపాలెం 15,774, కల్లూరు 21,079 మంది, పెనుబల్లి 12,993, సత్తుపల్లి 12,894, తల్లాడ 17,013, వేంసూరు 17,598, ఏన్కూర్ 9,081, కొణిజర్ల 15,917, సింగరేణి 11,833, వైరా మండలంలో 13,335 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హత కలిగి ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో తొలిరోజు రూ.10.55 కోట్లు జమ
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 30,459 మంది రైతులకు తొలిరోజు వారి వారి ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అయ్యింది. రూ.10,55, 50,020 సొమ్మును ఖాతాల్లో జమ చేయడంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి ముందుగానే సాయం అందడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయశాఖ వానకాలం పంటల సాగు కోసం ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చింది.
జిల్లాలోని 23మండలాల పరిధిలో రైతులకు రైతువేదికల ద్వారా విత్తనాలు, ఎరువులను అందించనుంది. ఇప్పటికే ఆయా మండలాల పరిధిలో సొసైటీలకు ఎరువుల నిల్వలు చేరాయి. ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం 10వేల ఎకరాలు అదనంగా పెరగడంతో విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. నకిలీల బెడద లేకుండా ముందస్తుగా విత్తనషాపులను తనిఖీ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం నుంచి జిల్లాలో ఉన్న రైతులందరికీ రైతుబంధు సాయం అందనుంది. ఇప్పటికే రైతుల ఖాతాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించి వారికి అందాల్సిన సాయాన్ని ట్రెజరీకి పంపించారు.