ఖమ్మం, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ):రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. సాగు కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు వివిధ రకాల పథకాలు ప్రవేశ పెడుతున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నది. కర్షకులను అధిక వడ్డీల నుంచి గట్టెక్కించేందుకు ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ఏటా ఒక్కో సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా రైతుల అకౌంట్లలో సొమ్ము జమ అవుతున్నది.
వానకాలం పెట్టుబడి సాయాన్ని మంగళవారం నుంచి జమచేయనున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 3.23 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.362 కోట్లు జమకానున్నాయి. గడిచిన ఐదేండ్లలో రైతుల ఖాతాల్లో రూ.2,417 కోట్లు జమ అయ్యాయి. గతేడాది 3.07 లక్షల మంది రైతులకు రైతుబంధు అందగా.. ఈ ఏడాది అదనంగా మరో 13,418 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. భద్రాద్రి జిల్లాలో 1,40,410 మంది రైతుల ఖాతాల్లో రూ.212 కోట్లు జమ కానున్నాయి. వీరిలో 1,687 మంది కొత్త రైతులు ఉన్నారు. పట్టాదారు పాసు పుస్తకం పొందిన ప్రతి రైతుకూ పథకం వర్తిస్తున్నది. ఏజెన్సీ రైతులకూ రైతుబంధు అందుతుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, రైతు రుణ మాఫీ ద్వారా ఆదుకుంటున్నది. విత్తనాలు నాటే సమయం నుంచి మార్కెటింగ్ వరకు అడుగడుగునా రైతులకు చేయూతనిస్తున్నది. దేశంలో మరెక్కడా లేని విధంగా పథకాలు రూపొందిస్తున్నది. ఉమ్మడి రాష్టంలో వ్యవసాయరంగం కుదేలైంది. నాటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాటి పాలకులు వ్యవసాయమే దండగ అన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఏటా ఒక్కో సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయిస్తున్నారు. సీజన్కు ముందే రైతుబంధు అందుతుండడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే అవసరం లేకుండానే రైతులు సాగు చేసుకుంటున్నారు.
దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా రైతుల అకౌంట్లలో సొమ్ము జమ అవుతున్నది. ఈ పథకం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వమూ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని ఓ పథకాన్ని అమలు చేస్తున్నది. వానకాలం సీజన్కు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 3.23 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.362 కోట్లు జమకానున్నాయి. ఇప్పటికే ఆర్థికశాఖ నిధులను ట్రెజరీకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. గడిచిన ఐదేండ్లలో రైతుల ఖాతాల్లో రూ.2,417 కోట్లు జమ అయ్యాయి. 2018 వానకాలంలో పథకం ప్రారంభమైంది. తొలుత ఎకరానికి రూ4 వేల చొప్పున జమ అయింది. నాలుగు సీజన్ల తరువాత 2020 నుంచి ప్రతి సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున అవుతున్నది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి అధిక వడ్డీలకు డబ్బు తీసుకునే అవసరం లేకుండా ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తున్నది. పట్టాదారు పాసు పుస్తకం పొందిన ప్రతి రైతుకు పథకం వర్తిస్తుంది. ఏజెన్సీ రైతులకూ రైతుబంధు అందుతుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 3.07 లక్షల మంది రైతులకు రైతుబంధు అందింది. ఈ ఏడాది అదనంగా మరో 13,418 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. భద్రాద్రి జిల్లాలో 1,40,410 మంది రైతుల ఖాతాల్లో రూ.212 కోట్లు జమకానున్నాయి. వీరిలో 1,687 మంది కొత్త రైతులు. వీరందరికీ రైతుబంధు వర్తించనున్నది.
సాగు పనులు వేగవంతం..
కేవలం పది రోజుల్లోనే వ్యవసాయశాఖ అధికారులు సొమ్ము జమ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దీంతో సాగు పనులు వేగవంతం కానున్నాయి. ఇప్పటికే కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు నాటే పనులు ప్రారంభించారు. ఈనెల చివరి వరకు పత్తి, అపరాలు సాగు చేసే అవకాశం ఉండడంతో రైతులు ఆ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఎరువులు, విత్తన దుకాణాలు రద్దీగా కనిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో రైతుబంధు అందుకోని రైతులు వెంటనే వ్యవసాయశాఖ విస్తరణ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
కరోనా సమయంలోనూ సాయం..
కరోనా వంటి కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ రైతుబంధు అందించారు. సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలిచారు. ఏటా రెండుసార్లు సీజన్కు ముందే సాయం అందుతున్నది. పెట్టుబడులకు ఇబ్బంది పడకుండా రైతులు దర్జాగా సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇస్తున్నది. మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నది.
– బోడ శ్రీను, రైతు, పోకలగూడెం,చండ్రుగొండ మండలం
నేటి నుంచి సొమ్ము జమ
నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమకానున్నది. ఇప్పటికే జిల్లా రైతుల వివరాలు, వారి ఖాతాల వివరాలు బ్యాంకులకు అందాయి. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.212 కోట్లు జమకానున్నాయి. పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు అందుతుంది.
– కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కొత్తగూడెం