అశ్వారావుపేట, జూన్ 27: రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్పాం సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దానికి అనుగుణంగా రైతుల సౌకర్యార్థం 2025 నాటికి నాలుగు పామాయిల్ ఫ్యాక్టరీలను నిర్మించనున్నామని ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఫ్యాక్టరీలు నిర్మించనున్న బీచ్పల్లి, తొర్రూర్, సిద్దిపేట, కల్లూరిగూడెం ప్రాంతాల్లో ప్రభుత్వం కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్పామ్ నర్సరీని రైతులతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 22 నర్సరీల్లో 55 లక్షల మొక్కలను సిద్ధం చేసినట్లు వివరించారు. నూతనంగా నిర్మించే ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని దిగుబడుల ఆధారంగా పెంచుకునేలా అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. మొదట 30 టన్నుల సామర్థ్యంతో నిర్మించే ఫ్యాక్టరీలను అవసరాలకు అనుగుణంగా 90 టన్నుల సామర్థ్యం వరకు విస్తరించుకోవచ్చన్నారు.
సిద్దిపేటలో రిఫైనరీ యూనిట్ ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామన్నారు. జూలై నుంచి రైతులకు మొక్కల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. 2023 మార్చి నాటికి ప్రతి రైతుకూ మొక్కలు అందజేస్తామన్నారు. ఆయిల్ఫెడ్ పరిధిలోని 8 జిల్లాల్లో 80 వేల ఎకరాల్లో ఈ ఏడాది సాగు విస్తరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. ఏదైనా డ్రిప్ సౌకర్యం ఉన్న రైతులకు మొక్కలు ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నామని, డ్రిప్ను ఏర్పాటు చేసుకోకుంటే మొక్కలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అనంతరం ఆయిల్పామ్ సాగులో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని ఆయిల్ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్కుమార్, ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.