రోజురోజుకూ తగ్గిపోతున్న భూసారాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో పంటలు పండాలంటే చాలా కష్టంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సేంద్రియ ఎరువులను అశ్రద్ధ చేస్తూ.. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులు వినియోగిస్తుండడంతో భూసారం క్రమంగా కనుమరుగవుతోంది. దానిని కాపాడుకోకపోతే రైతులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం పొంచి ఉంది. వానకాలం పంటలు వేసే సమయం ఆసన్నమైనందున భూసారాన్ని కాపాడడం కోసం పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల కలిగే లాభాలు, ఉండాల్సిన లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం.
కూసుమంచి, జూన్ 26:అధిక దిగుబడులే లక్ష్యంగా రైతులు విపరీతంగా రసాయన మందులను వినియోగిస్తున్నారు. దీంతో భూమి క్రమంగా తన సారాన్ని కోల్పోతోంది. దీనివల్ల అధిక దిగుబడులు రాకపోగా పంటలకు నష్టం కలగడం, భవిష్యత్తులో పూర్తిగా భూమి నిస్సారం కావడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ పరిస్థితులను అధిగమించి సుస్థిరమైన దిగుబడులు, పొందాలంటే భూసారాన్ని కాపాడడం ఒక్కటే మార్గం. అందుకోసం సేంద్రియ ఎరువులను పోషకాల యాజమాన్యాల్లో భాగం చేయాల్సిన అవసరం ఉంది. పశువుల ఎరువులు తక్కువ అవుతున్న తరుణంలో పచ్చిరొట్టను పైర్లసాగులో భాగం చేసుకోవడం తప్పనిసరి.
పచ్చిరొట్టతో లాభాలు..
పచ్చిరొట్ట వాడడం వల్ల భౌతిక, రసాయన, జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు అందించే అవకాశం ఉంది. నేలకు నీటిని, పోషకాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. నేల గుల్లబారి మురుగునీటి వ్యవస్థ మెరుగు పడుతుంది. నేలలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. అనేక జీవ రసాయన చర్యలు జరిగి పోషకాలు మొక్కలకు అందుతాయి. చీడపీడల ఉధృతిని తగ్గిస్తాయి. పచ్చిరొట్ట తరువాత వేసే పైర్లకు 25 శాతం నత్రజని తగ్గించవచ్చు. చౌడు నేలలు కూడా సారవంతంగా మారుతాయి. ఆ నేలల్లోనూ ఉత్పాదకత పెంచుకోవచ్చు.
పచ్చిరొట్ట పైరుకు ఉండాల్సిన లక్షణాలు..
త్వరగా పెరిగి ఎక్కువగా పచ్చిరొట్టను అందిస్తుంది. పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. త్వరగా కుళ్లి భూమిలో కలిసేటట్లు చేస్తుంది. పుష్పజాతి పంటలు ఎంపిక చేసుకుంటే వేరు బుడిపెల ద్వారా గాలిలో నత్రజని స్థిరీకరిస్తుంది. లోతైన వేరు వ్వవస్థ కలిగి నీటి ఎద్దడిని తట్టుకునేలా చేస్తుంది. కలుపు మొక్కలను అరికడుతుంది. అన్ని రకాలైన నేలల్లో పెరిగి నమ్మకమైన దిగుబడిని ఇచ్చేలా చేస్తుంది.
జీలుగులు.. లాభాలు..
చౌడు భూములు, వరి పండించే భూములకు జీలుగులు అనుకూలం. తేలికపాటి ఇసుక నేలల్లోనూ సాగు చేయొచ్చు. ఉరుబుడిపెలు ఎక్కువగా ఉండి నత్రజనిని ఎక్కువ స్థిరీకరిస్తుంది. ఎకరాకు 12 నుంచి 15 కిలోలు విత్తనాలు పడతాయి. పూత దశలో కలియ దున్నడం వల్ల ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టలో సుమారు 6 కిలోల నత్రజని 1 నుంచి 1.5 కిలోల భాస్వరం, 5 కిలలో పొలాషియం లభిస్తాయి.
జనుము.. లాభాలు..
జనుమును అన్ని రకాల నేలల్లో సాగు చేయొచ్చు. పచ్చిరొట్ట పశుగ్రాసానికి ఉపయోగ పడుతుంది. ఎకరాకు 12 నుంచి 14 కిలోల విత్తనాల చల్లుకోవాలి. పూత దశలో కలియదున్నడం వల్ల ఎకరానికి సుమారు 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టలో 7 కిలోల నత్రజని, కిలో భాస్వరం, 5 కిలోల పోటాషియం భూమికి లభిస్తాయి.
పిల్లి పెసర.. లాభాలు..
పిల్లి పెసరను అన్ని రకాల నేలల్లో సాగు చేయొచ్చు. చౌడు భూముల్లోనూ అనుకూలం. పచ్చిరొట్టగానూ, పశుగ్రాసంగానూ వినియోగించుకోవచ్చు. ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనాలు చల్లుకోవా లి. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్ట నుంచి సుమారు 7 కిలోల నత్రజని, కిలో భా స్వరం, 5 నుంచి 6 కిలలో పొటాషియం భూమికి అందుతాయి.
అలచందలు.. లాభాలు..
అలచందలను ఎరువుగానూ, పశువుల మేతగానూ వాడుకోవచ్చును. ఎకరానికి 10 నుంచి 12 కేజీల విత్తనాలను చల్లుకోవాలి. నీటిఎద్దడిని తట్టుకుంటుంది. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్ట ఎరువు నుంచి 4 నుంచి 5 కిలోల నత్రిజని, కిలో భాస్వరం భూమికి లభిస్తాయి.
పెసరతో కలిగే లాభాలు..
పెసర.. తొలకిరి వర్షాలకు చల్లుకొని కాయలు వచ్చాక వాటిని కోసుకొని తిరిగి పచ్చిరొట్టలాగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అవకాశం లేకపోతే పచ్చిరొట్టగానే వాడుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 3 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్ట సుమారు 5 కిలోల నత్రజనిని భూమికి అందిస్తుంది.
తెలుసుకోవాల్సిన మెళకువలు..
పచ్చి పైరు కాలం 60 నుంచి 70 రోజులు. కాబట్టి 60 రోజుల ముందుగానే పచ్చిరొట్టను వేసుకోవాలి. 60 రోజుల పంట వ్యవధిలో 45 రోజుల పూత దశలో కలియదున్నాలి. 15 రోజుల్లో కుళ్లి సేంద్రియ పదార్థంగా మారి పంటలకు పోషకాలను అందిస్తుంది. పైరు పెరిగితే పీచు పదార్థం పెరిగి తొందరగా కుళ్లదు. పచ్చిరొట్ట కలియదున్నే సమయంలో నేల తేమ ఎక్కువగా ఉండేలా చూడాలి. కుళ్లే సమయంలో ఆమ్లాలు విడుదలవుతాయి. కాబట్టి రెండు వారాలు కుళ్లిన తరువాతనే పంటలు వేయాలి. పచ్చిరొట్టకు ఎరువులు వాడాల్సిన పనిలేదు. కానీ విత్తనంతోపాటు 50 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ వేస్తే వేరు బాగా పెరుగుతుంది. పైర్లు త్వరగా ఎదుగుతాయి. పూతదశలో కలియదున్నితే తరువాత వేసే పంటలకు 25 శాతం రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. సుస్థిరమైన దిగుబడులతోపాటు భూసారాన్ని కాపాడుకోవచ్చు.